హైదరాబాద్ .. తొలి ఏకాదశి (first day of ekadasi ) సందర్భంగా ఎపి, తెలంగాణ (ap and telangana ) లోని. ఆలయాలన్నీ(temples ) నేటి తెల్లవారుజాము నుంచే కిటకిటలాడుతున్నాయి (heavy rush ) . ఆయా రాష్ట్రాలలోని అన్ని దేవాలయాల్లో అర్చకులు.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయాన్నే తరలివచ్చిన భక్తులతో కోవెలలన్ని కోలాహలంగా మారాయి. విష్ణు నామస్మరణలతో ఆలయ ప్రాంగణాలు మార్మోగుతున్నాయి. ఈ పవిత్ర దినాన విష్ణువును ఆరాధించి, ఉపవాసం ఉండటం వల్ల భక్తులు ఆశీర్వాదాలను పొందుతారని, ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తారని నమ్మకం.
రాజన్న సన్నిధిలో ఏకాదశి వైభవం..
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి పూజలు వైభవంగా జరిగాయి. స్వామివారికి, అనుబంధ పరివార దేవతలకు అర్చకులు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఇవాళ సాయంత్రం మహాపూజ, అఖండ భజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఐనవోలులో ఏకాదశి..
వరంగల్ పట్టణ జిల్లాలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఐనవోలు మల్లికార్జున ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. భ్రమరాంభిక అమ్మవారిని శాకాంబరి(కూరగాయలతో అలంకరణ) అవతారంలో అలంకరించారు. ఈఏడు వర్షాలు సమృద్ధిగా కురవాలని ఒంటిమామిడిపల్లి గ్రామాల మహిళలు అమ్మవారికి జలాభిషేకం నిర్వహించారు. హన్మకొండలోని శ్రీదేవి-భూదేవి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
యాదాద్రిలో ఏకాదశి వైభవం..
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో స్వామి అమ్మవార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన జరిపారు. బాలాలయంలో ఉదయం సుప్రభాత సేవ నిర్వహించారు. కవచ మూర్తులను ప్రత్యేక హారతులతో కొలిచారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. కరోనా నిబంధనల మధ్య వారు స్వామి వారిని దర్శించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
మంథనిలో భక్తుల కిటకిట
తొలి ఏకాదశి సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంథనిలోని గోదావరి నదిలో స్నానమాచరించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. గోదావరి తీరంలోని గౌతమేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి మొక్కులు చెల్లించారు. మంథనిలోని శైవక్షేత్రాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోతయడం వల్ల మంథనిలో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మంథని మున్సిపాలిటీ సిబ్బంది, పోలీసులు ఎప్పటికప్పుడు గోదావరి పరిసరాలను శుభ్రం చేస్తూ భక్తులకు తగిన జాగ్రత్తలు సూచిస్తున్నారు.
ఖమ్మంలో భక్తుల కోలాహలం..
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో తొలి ఏకాదశి పర్వదినం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. మధిరలోని శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం, శ్రీకల్యాణ వెంకటేశ్వరాలయం, బంజారా కాలనీలోని శ్రీలక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వరాలయం, శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి.. మొక్కులు చెల్లించుకున్నారు.
ఎపిలో…..
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రసిద్ధ వైష్ణవాలయాలు భక్తజన సంద్రంగా మారాయి. పవిత్రమైన ఈ రోజున స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు. దీంతో ఆలయ ప్రాంగణాలు గోవింద నామస్మరణతో మార్మోగిపోయాయి.
తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తొలి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసిన దేవస్థానం పాలకవర్గం, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసింది.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనం అనంతరం భక్తులకు దేవస్థానం ప్రాంగణంలో ప్రసాద వితరణ చేశారు. రెండు జిల్లాల్లోనూ పండుగ వాతావరణం నెలకొంది.