బెంగళూరు : వైసీపీ (YCP) ముఖ్య నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి (Chevireddy Bhaksar Reddy)కి మరో బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో ఆయనపై అభియోగాలు వస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం బెంగళూరు నుంచి శ్రీలంక రాజధాని కొలంబో వెళ్తుండగా.. బెంగళూరు (Bangalore)లోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో భద్రతా సిబ్బంది ఆయనను ఆపేశారు. ఇప్పటికే ఆయనపై లుకౌట్ నోటీసులు అమల్లో ఉన్నందున చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు స్పష్టం చేశారు.
కాగా, లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ఇప్పటికే దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. కేసుతో చెవిరెడ్డికి ఉన్న సంబంధాలపై ఇటీవలే అధికారులు ఆయన గన్మెన్ ఏఆర్ మదన్ రెడ్డి (AR Madan Reddy)ని విచారించింది. అయితే, అనూహ్యంగా ఇవాళ మదన్ రెడ్డి, సిట్ అధికారులపై సంచలన ఆరోపణలు చేస్తూ ప్రభుత్వానికి సంచలన లేఖ రాశాడు. ఆ లేఖలో లిక్కర్ స్కామ్ కేసులో తాము చెప్పినట్టు రాసి.. సంతకం చేయమని సిట్ అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. తన కంటే ముందు విచారణకు హాజరైన గిరి కూడా తాము చెప్పినట్లుగా విన్నాడని అధికారులు తనతో అన్నారని తెలిపాడు. అదేవిధంగా విచారణకు తాను యూనిఫాంలో వెళ్లినందుకు తిట్టారని.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లిక్కర్ స్కామ్తో సంబంధం ఉందని చెప్పమన్నారని వివరించాడు. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వనని చెప్పినందుకు తనపై 10 మంది అధికారులు దాడికి దిగారని.. ఇకపై ఒంటరిగా సిట్ విచారణకు వెళ్లేది లేదని లేఖలో మదన్ రెడ్డి స్పష్టం చేశాడు.