రామగిరి, మే 15 (ఆంధ్రప్రభ): సింగరేణి సంస్థ నిర్వహించిన బ్లాస్టింగ్ కారణంగా పెను ప్రమాదం తప్పింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని నాగేపల్లి గ్రామంలో 20కి పైగా ఇళ్లలో స్వల్పంగా బండరాళ్లు పడడంతో రేకులు ధ్వంసమయ్యాయి. పల్లెర్ల హారిక, రేణిగుంట్ల రాజమల్లు, పల్లెర్ల నరసయ్య, పల్లెర్ల పోచాలుకు స్వల్ప గాయాలయ్యాయి. లద్నాపూర్ గ్రామం నుండి బొక్కల వాగులోని వర్షపు నీరు వెళ్లేందుకు కాలువ తీస్తున్న క్రమంలో మధ్యలో పెద్ద బండ రాయి రావటంతో సింగరేణి సంస్థ అదికారులు బండను తొలగించేందుకు బ్లాస్టింగ్ ఏర్పాటు చేశారు.
నాగేపల్లి గ్రామానికి అతి సమీపంలో బ్లాస్టింగ్ చేయడం వల్ల బ్లాస్టింగ్ ధాటికి పెద్ద పెద్ద రాళ్లు ఎగిరి వెళ్లి పక్కనే ఉన్న జనవాసాలు, ఇళ్ల పైకప్పులపై పడడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. ఆర్జీ- 3 జీఎం సుధాకర్ రావు, రామగుండం ఏసీపీ మడత రమేష్, మంథని సిఐ రాజు గౌడ్, రామగిరి ఎస్ఐ చంద్రకుమార్, పోలీస్ సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. నాగేపల్లి గ్రామస్తులు సింగరేణి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. ఏసీపీ రమేష్ వారిని శాంతింపజేసి రాస్తారోకో విరమింప జేశారు.
రెండు రోజుల్లో నష్టపరిహారం అందించాలి… ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
బ్లాస్టింగ్ వల్ల జరిగిన ఘటనపై స్పందించిన ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బాధిత కుటుంబాలకు వెంటనే నష్టపరిహారాన్ని చెల్లించాలని, రెండు రోజుల్లో చెల్లింపు ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు.
