ముంబయి – : దేశీయ మార్కెట్లు నేడు ఫుల్ జోష్లో ఉన్నాయి. భారీ లాభాల్లో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం వంటి పరిణామాలతో బుల్ పరుగులు తీస్తోంది. దాంతో సెన్సెక్స్ ఏకంగా 2200 పాయింట్లకు పైగా పెరగ్గా.. నిఫ్టీ 24,500 మార్క్ పైన ట్రేడ్ అవుతోంది.
ఉదయం 9.58 గంటల సమయంలో సెన్సెక్స్ 2288 పాయింట్ల లాభంతో 81,742 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 703 పాయింట్లు ఎగబాకి 24,711 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీలో జియో ఫైనాన్షియల్, శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. సిప్లా స్టాక్స్ నష్టాల్లో ట్రేడింగ్ను మొదలు పెట్టాయి.
అమెరికా డాలర్ ఇండెక్స్ 100.57 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 64.22 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.4 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే స్థిరంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.07 శాతం లాభపడింది. నాస్ డాక్ 0.01 శాతం ఎగబాకింది.
భారత్, పాకిస్తాన్ మధ్య దాదాపు యుద్ధమేఘాలు అలుముకోవడంతో దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం చివర్లో బలహీనపడ్డాయి. అయితే వారాంతాన కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినప్పటికీ సరిహద్దు పొడవునా పాక్ అతిక్రమణలకు పాల్పడినట్లు వెలువడిన వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. దీంతో మరోసారి అనిశ్చిత పరిస్థితులు తలెత్తినట్లు పేర్కొన్నారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం, సరిహద్దులలో పరిస్థితులు సాధారణంగా ఉండటంతో మళ్లీ షేర్ మార్కెట్ లో జోష్ నింపింది.