బస్సు, బైక్‌ ఢీ.. యువకుడికి తీవ్ర గాయాలు

వికారాబాద్ క్రైం, ఆంధ్రప్రభ : వికారాబాద్‌ టూరిజం హోటల్‌ సమీపంలోని అనంతగిరి ఘాట్‌ రోడ్డు మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (టీజీ 34 జడ్‌ 0019) హైదరాబాద్‌ వెళ్తుండగా అనంతగిరి ఘాట్‌ రోడ్డు వద్ద మలుపు తిరుగుతున్న సమయంలో ఎదురుగా వస్తున్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ (టీఎస్‌ 08 హెచ్‌ఎస్‌ 4899)ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న మధువర్ధన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన బస్సులోని కొందరు ప్రయాణికులు గాయపడిన యువకుడిని వికారాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వికారాబాద్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.