భగవంతుడి కరుణ పుడమినంతా తడిపివేసే అపార జలధారలాంటిదనుకుంటే ఈ జలం ఒక్కో చోట విశేష గుణాలు కలిగిన తీర్థమై ప్రవహిస్తుంది. ప్రతి చుక్కా గొంతు తడిపేదే అయినా తీర్థానికున్న ప్రత్యేకత వేరు. అలాగే ప్రతి రోజూ విలువైనదే అయినా కొన్ని రోజులు విశిష్టమైనవిగా పేరొందుతాయి. అలాంటి విశిష్ట పర్వదినాల్లో అక్షయ తృతీయ కూడా ఒకటి అక్షయం అంటే క్షయం లేనిదీ వృద్ధి చెందుతూనే ఉండేదీ అనే అర్థాలున్నాయి. అంతులేని శుభఫలితాలనిచ్చే రోజుగా అక్షయ తృతీయను భావిస్తారు. ఈ రోజు చేసే దాన ధర్మాలైనా, పూజలూ పునస్కారాలైనా అనంత శుభాలనొసగుతాయన్నది వేదోక్తి. ఆ రోజున గతంలో జరిగిన ఉత్తమ శుభాలే ఆ పవిత్రతను తెచ్చిపెడతాయి.. వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయ అని పిలుస్తారు. శివుడిని ప్రార్థించి కుబేరుడు సంపదకు రక్షకుడిగా నియమితుడైన రోజూ, విష్ణుమూర్తి మహాలక్ష్మిని మనువాడిన పర్వదినమూ కూడా ఇదే. ఈ రోజు లక్ష్మీదేవికి అలంకరించి పూజ చేస్తారు. ఇలా చేస్తే ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుందని భక్తుల నమ్మిక. ఈ రోజు చేసే యజ్ఞయాగాది క్రతువులూ, పూజలూ, జపాలూ అక్షయమైన ఫలితాలనిస్తాయని మత్స్యపురాణం వివరిస్తోంది. అక్షయ తతీయనాడు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలాలనిస్తాయని నారద పురాణం పేర్కొంటోంది. అందుకే ఈ శుభదినాన ఏ పనిచేసినా అది విజయవంతం అవుతుందని చెబుతారు. అలాగే ఈ రోజు దుర్ముహూర్తాలూ, వర్జ్యాలూ ఉండవు. ఈ తిథి రోజు ఏ క్షణంలోనైనా శుభకార్యాలను చక్కగా చేసుకోవచ్చు. త్రేతాయుగం మొదలైంది అక్షయ తతీయ రోజేనని పురాణాలు చెబుతున్నాయి. విష్ణు స్వరూపుడయిన పరశురాముడు ఈ రోజే జన్మించాడట. ద్వాపర యుగంలోనూ ఈ రోజుకి విశిష్ట స్థానముంది. శ్రీకృష్ణుడి అన్న బలరాముడి జన్మదినం అక్షయ తృతీయే. అరణ్యవాసంలో ఉన్నప్పుడు పాండవులకు కృష్ణుడు అక్షయ పాత్రను ఈ రోజే ఇచ్చాడట. తన చిన్ననాటి స్నేహితుడు కుచేలుడు గుప్పెడు అటుకులు ఇచ్చినందుకే నందనందనుడు ఆయనకు అ్టషశ్వర్యాలనూ ప్రసాదించింది కూడా ఈ పర్వదినానేనట. నీవే దిక్కంటూ రెండు చేతులూ పైకెత్తి మొక్కిన ద్రౌపదికి అక్షయంగా చీరలు ఇచ్చిందీ ఈ రోజే. వేదవ్యాసుడు భారతాన్ని రాయడం ప్రారంభించిందీ, భగీరథుని వేడుకోలుతో శివుని జటాజూటం నుంచీ గంగ నేలను చేరిందీ ఈనాడేనట. శివుడి వాహనమైన నంది పుట్టిందీ ఈ రోజే కావడంతో ‘బసవ జయంతి’నీ జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్లోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం సింహాచలంలో స్వామి నిజరూప దర్శనం అక్షయ తృతీయ రోజు మాత్రమే భక్తులకు లభిస్తుంది. మిగతా ఏడాదంతా స్వామిని చందనపు పూతతో కప్పివేస్తారు. ప్రముఖ శైవక్షేత్రం బదరీనాథ్ ఆలయాన్ని చలికాలం తర్వాత ఈ రోజే తిరిగి తెరుస్తారు. మహాశివుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రత విధానాన్ని వివరించాడు. అనంత ఫలితాలనొసగే మహావిష్ణువే ఈ వ్రతానికి అధినాయకుడు.
య: కరోతి త్రుతీయామాం కృష్ణం చందన భూషితం-వైశాఖస్యసితే పక్షే సయాత్యచ్యుత మందిరమ్”
శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన వైశాఖ శుక్ల తృతీయ యందు శ్రీకృష్ణునికి చందనామ లేపనం చేసిన భక్తులకు విష్ణుసాలోక్యం కలుగుతుందని ధర్మసింధువు చెప్తుంది. ఈ అక్షయ తదియనాడు జప, హూమ, తర్పణాలతో పితదేవతలను ఆరాధిస్తే వారికి అక్షయ పుణ్యలోకాలు కలుగుతాయని శాస్త్రం చెప్తోంది. భీష్మ ఏకాదశినాడు ఎలాగైతే తర్పణాలు ఇస్తామో ఈ అక్షయతదియనాడు పరశురామునికి అర్ఘ్యప్రధానం చేయాలి.దీని ప్రకారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలంటు స్నానం చేసి, విష్ణుమూర్తిని పూజించి, అక్షతలు తలమీద వేసుకుని, శక్తిమేర దానధర్మాలు చేయాలి. కొంతమంది ఈ రోజు ‘వైశాఖ పూజ’ చేస్తారు. మజ్జిగ, పానకం, చెప్పులు, గొడుగు, మామిడి పండ్లు, బట్టలు, గంధం తదితరాలను దానం చేస్తారు. ఎండలతో మండిపోయే వైశాఖ మాసంలో ఇలాంటి పుణ్యదినాన ఎవరి గొంతు చల్లబరచినా, ఎవరికి కాస్త దానం చేసినా ఆ ఫలితం అక్షయమవుతుందన్నమాట. ఈ రోజున పితదేవతలకు తర్పణాలు వదిలే సంప్రదాయమూ ఉంది. అలా చేస్తే పితృదేవతలకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందంటారు. నిండు మనసుతో చేసే ప్రతి మంచిపనీ అక్షయమవ్వాలన్నదే అక్షయ తృతీయ ఇచ్చే ఆశీర్వాదం.
- శ్రీధర్ వాడవల్లి