మహబూబ్నగర్, ఆంధ్రప్రభ : మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలంలోని కందూరు జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న శోభారాణి (50) మృతిచెందారు. సమాచారం అందుకున్న మూసాపేట పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఓవర్టాక్ చేయడంతో..
కర్నూల్-హైదరాబాద్ జాతీయ రహదారిలో కందూర్ పెద్దవాగు వంతెనపై లారీ, స్కూటీ సమాంతరంగా వెళుతున్నాయి. అదే సమయంలో వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఓవర్టేక్ చేస్తుండగా, దారి లేకపోవడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. వెనుక నుంచి వస్తున్న కారు డీసీఎంను ఢీ కొట్టింది. కారును వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో డీసీఎం, లారీ మధ్యలో ఇరుకున్న కారు నుజ్జు నుజ్జు అయ్యింది. కారులో ఉన్న ఓ మహిళ శోభారాణి (50) మృతిచెందారు. ఆమె భర్త ఎల్లారెడ్డికి, శోభారాణి తల్లి విమలకు, డ్రైవర్కు గాయాలయ్యాయి.
డీసీఎం వ్యాన్ ముందు వెళుతున్న స్కూటీని ఢీ కొట్టింది. స్కూటీపై ఉన్న రఘుపతి రెడ్డికి కూడా గాయాలయ్యాయి. వంతెనపై ప్రమాదం జరగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అడ్డాకుల ఎస్ఐ శ్రీనివాసులు, మూసాపేట ఎస్ఐ వేణు, పోలీసు సిబ్బంది చేరుకుని, ఎల్అండ్టీ సిబ్బంది, స్థానికుల సహకారంతో క్షతగాత్రులను అతికష్టం మీద కారులో నుంచి బయటకు తీశారు. అనంతరం అంబులెన్స్లో మహబూబ్నగర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మృతురాలిది వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి. వారు హైదరాబాద్లో జరుగుతున్న వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు.