Child Safety | మెటాకు షోకాజ్ నోటీసులు

బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన నిషేధిత కంటెంట్‌పై కేంద్రం ఆగ్రహం
ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం..
లేకపోతే ఐటీ చట్టం, పోక్సో చట్టం కింద చర్యల హెచ్చరిక

Child Safety | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో బాలల లైంగిక దోపిడీ, వేధింపులకు సంబంధించిన నిషేధిత కంటెంట్ కనిపించడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ (ఎంఈఐటీవై), అలాంటి కంటెంట్‌ను వెంటనే తొలగించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకునే చర్యలపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో బాలల లైంగిక దోపిడీ, వేధింపులకు సంబంధించిన నిషేధిత కంటెంట్ అందుబాటులో ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మెటాపై కఠిన వైఖరి అవలంబించింది. ఈ తరహా కంటెంట్ సామాజిక మాధ్యమ వేదికలో ఎలా ప్రచారంలోకి వచ్చిందో వివరించాలని మెటాను కేంద్రం ప్రశ్నించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ జారీ చేసిన నోటీసులో, బాలల లైంగిక దోపిడీ, వేధింపులకు సంబంధించిన చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లోయిటేటివ్ అండ్ అబ్యూజ్ మెటీరియల్ (CSEAM) వంటి నిషేధిత కంటెంట్‌ను తక్షణమే పూర్తిగా తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

అంతేకాకుండా, ఇలాంటి కంటెంట్ భవిష్యత్తులో మళ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించకుండా ఎలాంటి సాంకేతిక, పరిపాలనా చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలతో ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని మెటాను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక ప్రకారం, నిర్దేశించిన గడువులోగా తగిన వివరణ ఇవ్వకపోయినా లేదా నిషేధిత కంటెంట్ తొలగించడంలో విఫలమైనా, సమాచార సాంకేతిక (ఐటీ) చట్టంతో పాటు పిల్లలను లైంగిక నేరాల నుంచి రక్షించే పోక్సో (POCSO) చట్టం–2012 నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది.

ఆన్‌లైన్ వేదికలపై పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం, సామాజిక మాధ్యమ సంస్థలు తమ కంటెంట్ పర్యవేక్షణ వ్యవస్థలను మరింత పటిష్ఠం చేసి, చట్టవిరుద్ధమైన, నిషేధిత కంటెంట్‌ను వెంటనే గుర్తించి తొలగించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ పరిణామం దేశంలో డిజిటల్ వేదికల బాధ్యత, పిల్లల ఆన్‌లైన్ భద్రత, నిషేధిత కంటెంట్ నియంత్రణ అంశాలపై మరోసారి చర్చకు దారితీసింది.