సూర్యాపేట నుంచి బయల్దేరిన రైతులు
నెమ్మికల్ దండు మైసమ్మ దేవాలయంలో పూజలు
యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
సూర్యాపేట, ఆంధ్రప్రభ : కేసీఆర్పై కొండంత అభిమానంతోపాటు సాహసోపేతమైన యాత్రగా ఎడ్లబండ్లలో వెళ్లడం హర్షణీయమని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూరు ఎస్ మండలం నెమ్మికల్ దండు మైసమ్మ దేవాలయంలో పూజలు చేసి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… బీఆర్ఎస్ సభకు సూర్యాపేట నుంచి రైతులు ఎడ్ల బండ్లతో తరలి వెళ్లడం ఆనందంగా ఉందన్నారు. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగబోతుందన్నారు. బండెనక బండి కట్టి.. 16 బండ్లు కట్టి అన్న పాటను సూర్యాపేట రైతులు మళ్లీ గుర్తు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతాంగంతోపాటు అన్ని రంగాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి తప్పు చేశామని తెలుసుకున్నారన్నారు. దండగ అనుకున్న వ్యవసాయాన్ని పండగలాగా మార్చిన ఘనత కేసీఆర్ దేనన్నారు. అందుకే కేసీఆర్ మీద అభిమానంతో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రైతాంగం ఎడ్లబండ్లపై బయలుదేరినట్లు చెప్పారు. ఎల్కతుర్తి మట్టిని తాకి, రజతోత్సవ సభను తిలకించి కేసీఆర్ మాటలు వినాలన్న రైతుల తపన ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు.