BREAKING | LOC సమీపంలో భారీ పేలుడు..

  • ఒకరు మృతి.. నలుగురికి గాయాలు..
  • ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) సమీపంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. గుల్మర్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశా పోస్టు సమీపంలోని సుమ్లీ వాలి ధోక్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు.

మృతుడిని బారాముల్లా జిల్లా చందూసా ప్రాంతానికి చెందిన జబీర్ అహ్మద్ బజాద్‌గా పోలీసులు గుర్తించారు. పేలుడు తీవ్రతకు అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక ఈ ప్ర‌మాదంలో గాయపడిన మ‌రో నలుగురిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.

చాలా కాలం క్రితం పేలకుండా మిగిలిపోయిన ఓ పాత షెల్ ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బాధితుడు ఆ షెల్‌ను చేతబట్టిన సమయంలోనే పేలుడు సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే పేలుడుకు గల ఖచ్చితమైన కారణాన్ని అధికారులు ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు.

ఘటన అనంతరం భద్రతా బలగాలు మొత్తం ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చేపట్టాయి. పేలుడుకు గల అసలు కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు సంయుక్తంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.