న్యూ ఢిల్లీ – దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం రాత్రి ఈ ఫలితాలను విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం తుది కీ విడుదల చేసిన అధికారులు.. విద్యార్థులు సాధించిన పర్సంటైల్ స్కోరుతో ఫలితాలను విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించగా.. 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. కాగా, 110 మంది విద్యార్థుల ఫలితాలను నిలిపి వేసింది. అభ్యర్థులు ఫోర్జరీ దస్త్రాలను ఉపయోగించారని…అందుకే వారి ఫలితాలను ఆపేశామని ఎన్టీయే చెప్పింది.
రాజస్థాన్కు చెందిన మహ్మద్ అనాస్ ఫస్ట్ ర్యాంకు, ఆయుష్ సింఘాల్ రెండో ర్యాంకు సాధించారు. 100 పర్సంటైల్ సాధించిన వారిలో తెలంగాణ నుంచి హర్ష ఎ.గుప్తా, వంగల అజయ్రెడ్డి, బనిబ్రత మజీ, ఏపీ నుంచి సాయిమనోజ్ఞ గుత్తికొండ ఉన్నారు. కాగా, హర్ష ఎ.గుప్తా దేశవ్యాప్తంగా 8వ ర్యాంకు సాధించగా, అజయ్రెడ్డి ఆలిండియా 16వ ర్యాంకుతో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో టాప్లో నిలిచాడు. సాయిమనోజ్ఞ ఆలిండియా 22వ ర్యాంకు, బాలికల్లో 2వ ర్యాంకు సాధించింది. బనిబ్రత మజీకి ఆలిండియా 24వ ర్యాంకు లభించింది.