కర్నూల్ బ్యూరో, కర్నూలు : రాయలసీమలో వలసలు లేకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో మంత్రి పర్యటించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి గురువైభవోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మార్చి 1వ తేదీ శనివారం నుంచి ఆరురోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. 6వ తేదీ శ్రీ రాఘవేంద్ర స్వామి జన్మదిన వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ రాఘవేంద్ర స్వామి పీఠాన్ని అధిష్టించిన పరమ పవిత్ర రోజును పురస్కరించుకుని మఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థుల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 404వ పాదుకా పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు పొందారు.

ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోరిన కోర్కెలు తీర్చే దేవుడు శ్రీ రాఘవేంద్రస్వామి. రాఘవేంద్రస్వామి గురువైభవోత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలన్నారు. ఇందుకోసం అహర్నిశలు కృషిచేస్తామన్నారు. రాయలసీమలో వలసలు లేకుండా చూడాలన్నదే తమ లక్ష్యమన్నారు. వర్షాలు బాగా కురవాలని కోరుకుంటున్నానన్నారు. దేవుని ఆశీస్సులు తమకు ఉండాలన్నారు. పట్టాభిషేక మహోత్సవం అనంతరం మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు వారు మంత్రి లోకేష్ ను శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా మాంచాలమ్మ అమ్మవారిని దర్శించుకుని మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు పొందారు.

రథోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్..
పట్టాభిషేక మహోత్సవం అనంతరం ఆలయంలో నిర్వహించిన రథోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. మంగళ వాయిద్యాలు, అశేష భక్త జనసందోహం మధ్య రథాన్ని లాగారు. శ్రీ రాఘవేంద్రస్వామి నామస్మరణతో దేవాలయ ప్రాంగణం మారుమోగింది. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.