రేషన్ భద్రత! కొత్త కార్డులకు మోక్షం
కార్డుల్లో కుటుంబ సభ్యుల చేరికలు
కొత్తగా 4.76 లక్షల దరఖాస్తులకు ఆమోదం
రాష్ట్ర వ్యాప్తంగా 11.30 లక్షల మందికి ప్రయోజనం
ఈనెల 14న తుంగతుర్తిలో భారీ బహిరంగ సభ
ముఖ్యమంత్రి రేవంత్ చేతుల మీదుగా కార్డుల పంపిణీ
రేషన్ కార్డు పత్రాలను అందజేయనున్న సీఎం
నియోజకవర్గాల్లో మంత్రలు, ఎమ్మెల్యేలతో కార్యక్రమం
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :
పేదలకు ఆహార భద్రత కల్పించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తోంది. తాజాగా 4.76 లక్షల దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. ఈనెల 14న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో నిర్వహించే సభలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 11.30 లక్షల మంది పేదలకు ప్రయోజనం కలగనుంది. రేషన్కార్డుల మంజూరుతో నిరుపేదలకు భారీగా లబ్ధి చేకూరుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఈనెల 14వ తేదీన జరగనున్న సభలో కొత్త రేషన్కార్డుల పంపిణీని సీఎం ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు రేషన్కార్డు పత్రాలను అందిస్తామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు.
కొత్త సభ్యుల చేరికలు..
నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల కొత్త రేషన్ కార్డులను అందిస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. కొత్త రేషన్కార్డుల మంజూరుతోపాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో కొత్త సభ్యులనూ చేర్చారు. అటు కొత్త కార్డులు, ఇటు పాత కార్డుల్లో చేరికలతో పేద కుటుంబాల సభ్యులు పెద్ద సంఖ్యలో రేషన్ పథకంలో లబ్ధిదారులయ్యారు.
డైనమిక్ కీ రిజిస్టర్లోకి ..
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తుంగతుర్తి సభ కంటే ముందే డైనమిక్ కీ రిజిస్టర్-డీకెఆర్లో కొత్త లబ్ధిదారుల పేర్లు నమోదు చేయనున్నారు. డీకేఆర్లో నమోదు అయినవారికే రేషన్ లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వ క్యూఆర్ కోడ్తో స్మార్ట్ రేషన్ కార్డుల్ని జారీ చేయాలని నిర్ణయించగా.. టెండర్ల ప్రక్రియలో ఓ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రస్తుతానికి పేపర్ రూపంలోనే ఈ రేషన్ కార్డు ఇవ్వనున్నారు. ఈ నిర్ణయంతో ఆరు నెలల్లో 41 లక్షల మందికి రేషన్ ప్రయోజనం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం 2025 నుంచి కొత్త రేషన్కార్డులను మంజూరు చేస్తోంది. మే 23వ తేదీ వరకు మంజూరు చేసినవి తాజాగా ఆమోదం తెలిపినవి కలిపి ఆరు నెలల్లో మొత్తం 41,11,357 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది.