హైదరాబాద్, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ పదేళ్ల ఆర్థిక విధ్వంసాన్ని అధిగమిస్తూ.. పునర్నిర్మాణ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతోందని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్యే మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్లో తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన.. ఆరు దశాబ్దాల నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించిందని ఆయన అన్నారు. ఎన్నో ప్రాణ త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వివరించారు.
చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమ బాటలో తెలంగాణ నడుస్తోందని, రెండు కళ్ల సిద్ధాంతంతో పాలన సాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
సామాజిక న్యాయం కాంగ్రెస్ సంకల్పం
సామాజిక న్యాయం కాంగ్రెస్ సంకల్పం అని మహేశ్కుమార్ గౌడ్ చెప్పారు. తెలంగాణలో శాస్త్రీయ కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణతో దేశానికే మార్గదర్శకమని కొనియాడారు. దేశవ్యాప్తంగా కుల సర్వే జరగాలన్న అగ్రనేత రాహుల్ గాంధీ ఆకాంక్ష అని చెప్పారు. ఒక్క ఏడాదిలోనే 65,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని హర్షం వ్యక్తం చేశారు. రాజీవ్ యువ వికాస్ ద్వారా 5 లక్షల యువతకు ఆర్థిక సాయం, మహిళా సాధికారత దిశగా మహాలక్ష్మి పథకం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సబ్సిడీ, రైతు రుణమాఫీ, రూ.500 వరి బోనస్, సన్న బియ్యం వంటి పథకాలు తీసుకొచ్చినట్లు గుర్తుకు చేశారు. ఇక 2.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడితో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని హర్షం వ్యక్తం చేశారు.
