IND vs NZ | తుది పోరుకు సిద్ధం..

  • న్యూజిలాండ్‌తో టీమిండియా అమీతుమీ
  • టీమిండియా 25 ఏళ్ల కసి
  • కివీస్ కు హ్యాట్రిక్ విన్ ?
  • ఫైనల్ ఫైట్ పై అభిమానుల్లో తీవ్ర‌ ఉత్కంఠ..

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తుది పోరుకు రంగం సిద్ధమైంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఫైన‌ల్ పోరులో భారత్ – న్యూజిలాండ్ తలపడనున్నాయి. తొలి సెమీఫైనల్ లో ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా ఫైనల్ కు చేరుకోగా, రెండో సెమీఫైనల్ లో దక్షిణాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ ఫైనల్ లోకి అడుగుపెట్టింది.

ఇక రెండు జట్ల మధ్య ఫైనల్ ఫైట్ మార్చి 9న (ఆదివారం) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో… భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు జరుగుతుంది. ఈ టోర్నీలో వరుసగా 4 మ్యాచ్‌ల్లో గెలిచి ఓటమెరుగని జట్టుగా ఫైనల్స్‌లోకి అడుగుపెట్టిన టీమిండియా మంచి ఉత్సాహంతో ఉంది. అదే జోరుతో న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్‌ను అందుకోవాలనే కసితో ఉంది.

ఈ సిరీస్‌లో టీమిండియా అజేయంగా ఫైనల్స్‌కు చేరుకోగా, న్యూజిలాండ్ జట్టు భారత్ చేతిలో ఓడిపోయింది. అయితే, సమిష్టి ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకున్న న్యూజిలాండ్… ఫైనల్‌లో కూడా ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారత్‌ను ఓడించాలని పట్టుదలతో ఉంది. లీగ్ దశలో టీమ్ ఇండియా చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది.

న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ బలంగా ఉంది. టీమిండియాను దెబ్బ కొట్టడమే లక్ష్యంగా కివీస్ ఈ ఫైనల్లోకి అడుగుపెడుతుంది. దీంతో ఫైనల్ మ్యాచ్ లో భారత్ కు గట్టి సవాల్ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.

నిజానికి టీమిండియాపై ఒత్తిడి తెచ్చిన ఏకైక జట్టు కివీస్ కావడం గమనార్హం. బలబలాల పరంగా ఇరు జట్లు సమంగా ఉన్నాయి. దాంతో ఫైనల్ పోరు హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయి.

25ఏళ్ల కసితో టీమిండియా..

ఈ రెండు జట్లు ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో తలపడటం ఇది మూడోసారి. గత రెండు ఫైనల్స్‌లోనూ కివీస్ భారత్‌పై విజయం సాధించింది. 2000 సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తొలిసారిగా తలపడ్డాయి.

ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 4 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించి తొలి ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత ఈ రెండు జట్లు 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కూడా న్యూజిలాండ్ భారత్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది.

అయితే, ఇప్పుడా ఓటముల‌కి ప్రతీకారం తీర్చుకోవడానికి టీమిండియా సిద్ధమైంది. ఇప్ప‌టికే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్ దశలోని ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో కివీస్‌ను ఓడించిన టీమిండియా… ఫైనల్‌లో కూడా కివీస్‌ను మ‌ట్టిక‌రిపించి టైటిల్‌ను కైవసం చేసుకోవాలని చూస్తుంది.

ఈ మ్యాచ్ లో గెలిచి గత రెండు పరాజయాలకు టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా… లేక న్యూజిలాండ్ హ్యాట్రిక్ ఫైనల్ విజయాలు సాధిస్తుందా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *