హైదరాబాద్: నగర శివారులోని మొయినాబాద్ మండలం తొల్కట్ట ఫామ్ హౌజ్ లో కోడిపందేల నిర్వహణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాదాపూర్ లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. కోడి పందేల నిర్వహణపై వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. కాగా ఈ ఫామ్ హౌజ్ ను భూపతిరాజుకు లీజుకు ఇచ్చామని ఎమ్మెల్సీ చెబుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం ఇవ్వాలని పోలీసులు ఆయనకు నోటీసులిచ్చారు.
ఇదిలా ఉండగా, మంగళవారం పొద్దుపోయాక పోలీసులు నిర్వహించిన దాడుల్లో మొత్తం 61మంది చిక్కిన విషయం తెలిసిందే. వారి వద్ద రూ.30లక్షల నగదు, జూదక్రీడలో ఉపయోగించే రూ.కోటి విలువైన బెట్టింగ్ కాయిన్లు దొరికాయి. పోలీసులు 50కార్లు, 80పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఎక్కువ మంది వ్యాపారులే. అందరికీ నోటీసులిచ్చి వదిలేశారు.