రోగులకు అందించే సేవల్లో రాజీ ప్రసక్తే లేదు

రోగులకు అందించే సేవల్లో రాజీ ప్రసక్తే లేదు
ఆసుపత్రి సేవలపై పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం కావాలి
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఆంధ్రప్రభ నందిగామ : ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యాధికారులు, సిబ్బంది కృషిచేయాలని, ఆసుపత్రి సేవలపై పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం కావాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం నందిగామలోని డీవీఆర్ కాలనీ యూపీహెచ్సీతో పాటు స్థానిక సీహెచ్సీని తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యత, సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత, రోగులకు అందిస్తున్న సేవలు, అవుట్పేషెంట్ (ఓపీ) రిజిస్టర్, ఔషధ నిల్వలు, ల్యాబ్ పరీక్షలు, టీకాల కార్యక్రమం తదితర విషయాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ గర్భిణీలు, చిన్నారులకు ప్రత్యేక శ్రద్ధతో సేవలు అందించాల్సిన అవసరముందన్నారు. వేసవి కాలం నేపథ్యంలో జ్వరాలు, నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణపై ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్ ద్వారా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారని, వాటిని పరిశీలించి ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్ది సేవల నాణ్యతను మెరుగుపరచుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
