ఇందిరా మహిళాశక్తి చీరల ఆర్డర్
గడువులోగా మొదటి చీర ఇవ్వాలి
రెండో చీర ఆర్డర్కు సిద్ధం కావాలి
దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్
బతుకమ్మ చీరల బకాయిలు ₹280 కోట్లు చెల్లించాం
₹50 కోట్లతో యార్న్ బ్యాంకు ఏర్పాటు
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
సిరిసిల్ల, ఆంధ్రప్రభ :
సిరిసిల్ల చేనేత పరిశ్రమను ఆదుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్సే ఆది శ్రీనివాస్ అన్నారు. ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి సిరిసిల్ల చేనేత పరిశ్రమకు అప్పగించినట్లు తెలిపారు. దీంతో చేనేత కార్మికులకు చేతినిండా పని కల్పిస్తున్నామని చెప్పారు. సిరిసిల్లలోని గణేష్ నగర్ లో ఉన్న మామిడాల నారాయణ, కొండ సుభాష్ కు చెందిన మరమగ్గాల యూనిట్లను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చేనేత జౌళి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా చేనేత జౌళి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్య మాట్లాడారు. సిరిసిల్ల చేనేత పరిశ్రమను ఆదుకుంటామన్నారు. అవసరమైన ఆర్డర్లన్నీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందజేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇందిరా మహిళల శక్తి చీరల ఆర్డర్ పొందిన వారు మొదటి చీర ఉత్పత్తిని త్వరగా పూర్తి చేసి అందజేయాలని సూచించారు. రెండో చీర ఆర్డర్ కు సిద్ధం కావాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకొని మరింత అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప రెడ్డి, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఏడీ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
చీరల ఉత్పత్తి పరిశీలన
ఈ సందర్భంగా వారు చీరల ఉత్పత్తిని పరిశీలించారు. అలాగే కార్మికులైన వేముల శ్రీనివాస్, మెరుగు శ్రీనివాస్ తదితర కార్మికులతో ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్ మాట్లాడారు. ప్రతి రోజు ఎన్ని మీటర్ల చీర ఉత్పత్తి చేస్తున్నారని? వారానికి ఎంత ఆదాయం వస్తుందని? అడిగి తెలుసుకున్నారు. చీరల ఉత్పత్తిలో ఏమైనా ఇబ్బంది ఎదురవుతున్నాయని ఆరా తీశారు. తమకు ప్రతివారం రూపాయలు 4000 నుంచి 5000 వరకు ఆదాయం వస్తుందని కార్మికులు వారి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి, కార్మికులను ఆదుకునేందుకు చేతినిండా పని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని వివరించారు. ఇందులో భాగంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఇందిరా మహిళ శక్తి కింద చీరల ఉత్పత్తి ఆర్డర్లు అందించామని తెలిపారు.
కార్మికులు, ఆసాములు కోరిన విధంగా ధర నిర్ణయం
చేనేత కార్మికులు, ఆసాములు కోరిన విధంగా ధర నిర్ణయిస్తామని వేముల శ్రీనివాస్ తెలిపారు. ఇందిరా మహిళా శక్తి చీరలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని కార్మికులు, ఆసాములకు దాదాపు ఎనిమిది నెలల పాటు ఉపాధి లభిస్తుందని చెప్పారు. గతంలోని బతుకమ్మ చీరల బకాయిలు దాదాపు 280 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా దశాబ్దాల కల నెరవేరుస్తూ వేములవాడలో రూపాయలు 50 కోట్లతో యార్న్ బ్యాంకు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అవసరమైన యార్న్ అంతా అక్కడ అందుబాటులో పెడుతున్నామని తెలిపారు. ఇతర ప్రభుత్వ శాఖ ఆర్డర్లు సిరిసిల్లకు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో కార్మికులు ఉపాధి లేక ఇబ్బంది పడేవారని, ఇప్పుడు చేతినిండా పని ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆర్డర్లను ఆసాములు, కార్మికులు సద్వినియోగం చేసుకొని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. సెస్ పరిధిలోని బ్యాక్ బిల్లింగ్ సమస్య కోర్టు పరిధిలో ఉందని దానిపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇతర మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు.