ఇంద్రకీలాద్రిపై వైభవంగా ‘ఏరువాక పౌర్ణమి వేడుకలు.
ఇంద్రకీలాద్రిపై వైభవంగా ‘ఏరువాక పౌర్ణమి వేడుకలు.
ఇంద్రకీలాద్రి ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో “ఏరువాక పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన రైతు భక్త బృందానికి ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికి, అమ్మవారి ప్రత్యేక దర్శనం మరియు వేదాశీర్వచనం ఏర్పాటు చేసి, పవిత్ర తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ విశిష్ట కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ మహిళా విభాగం సంకల్పంతో, ఆ సంస్థ రాష్ట్ర మహిళా కో-ఆర్డినేటర్ శ్రీమతి కరి రమాసుందరి బృందం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేసి నిర్వహించారు. ఏరువాక పౌర్ణమి అనేది రైతులు గింజలు (విత్తుకొని) నాటుకొని నారు తయారు చేసుకునే పవిత్రమైన వ్యవసాయ సీజన్ ప్రారంభ దినం. అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం ఈ రోజున భూమాతను, పశువులను, గంగమ్మను భక్తితో పూజించుకుంటారు.
ఈ సనాతన సంప్రదాయాన్ని కాపాడుతూ, హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో కొన్ని కోట్ల సార్లు చేసిన ‘రామనామ జపము’ ద్వారా పవిత్రీకరించబడిన వడ్లను (ఆహార గింజలను) శ్రామిక రైతు మహిళలకు దోసిడు వడ్లుగా పసుపు, కుంకుమ సౌభాగ్య సత్కారాలతో సమర్పించారు. పంట విత్తినప్పటి నుండి, ఆ పంట చేతికి వచ్చి ఉత్తమ ఫలితం రైతు మహిళలు పొందే వరకు నిరంతరం రామనామ జపంతో ప్రకృతిని ప్రసన్నం చేసుకోవడం, అలాగే భూసూక్త, నీలా సూక్త, వరుణసూక్త పారాయణలతో ప్రకృతిని నిత్యం పూజించే ఒక గొప్ప వ్రత దీక్షను ఈ సందర్భంగా వారు చేపట్టారు. ఆహార గింజలను దైవత్వంతో పవిత్రీకరించి రైతులకు అందించడం ద్వారా రాష్ట్రంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలనే సత్సంకల్పం ఈ కార్యక్రమం వెనుక దాగి ఉంది. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ మహిళా ప్రతినిధులు ఆలయ అధికారులు, అర్చకులు,పెద్ద సంఖ్యలో శ్రామిక రైతు మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందారు.
