సోషల్ మీడియాలో విద్వేష పోస్టులు చేస్తే కఠిన చర్యలు

సోషల్ మీడియాలో విద్వేష పోస్టులు చేస్తే కఠిన చర్యలు

  • చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: కడప జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనల నేపథ్యంలో సోషల్ మీడియా వినియోగంపై చిత్తూరు జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. సోషల్ మీడియాలో మత విద్వేషపూరిత పోస్టులు, వదంతులు, రెచ్చగొట్టే సందేశాలు వ్యాప్తి చేయవద్దని ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఆయన హెచ్చరిక జారీ చేశారు.

వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా వేదికల ద్వారా మతపరమైన ద్వేషాన్ని రెచ్చగొట్టే ఫోటోలు, వీడియోలు, సందేశాలు లేదా అభ్యంతరకర కంటెంట్‌ను షేర్ చేయడం చట్టరీత్యా శిక్షార్హమని ఎస్పీ స్పష్టం చేశారు. “సమాజంలో శాంతి, మత సామరస్యాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. మత విద్వేషాన్ని ప్రోత్సహించే లేదా అశాంతిని రేకెత్తించే కంటెంట్‌ను పోస్ట్ చేయడం తీవ్రమైన నేరం” అని ఆయన పేర్కొన్నారు.

“ఒక్క పోస్టు సమాజంలో అశాంతిని సృష్టించగలదు. పోస్టు చేసే ముందు దాని ప్రభావం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి” అని సూచించారు. సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్‌లు తమ గ్రూపుల్లో షేర్ అయ్యే ప్రతి సందేశాన్ని నిశితంగా పరిశీలించాలని, ద్వేషపూరిత లేదా రెచ్చగొట్టే కంటెంట్ గుర్తిస్తే వెంటనే తొలగించి సంబంధిత వ్యక్తులను గ్రూప్ నుంచి తొలగించాలని ఎస్పీ ఆదేశించారు.

“బాధ్యతాయుతంగా ఆలోచించండి.. బాధ్యతాయుతంగా వ్యవహరించండి. ప్రతి గ్రూప్ అడ్మిన్ చట్టవిరుద్ధ కంటెంట్ సర్క్యులేట్ కాకుండా చూడాలి” అని హెచ్చరించారు. తప్పుడు ప్రచారం, ఫేక్ న్యూస్, మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలను సృష్టించడం, ఫార్వర్డ్ చేయడం లేదా ప్రచారం చేయడం వంటి చర్యలకు పాల్పడేవారిపై సైబర్ క్రైమ్ మరియు ఇతర చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యలను ఏమాత్రం సహించబోమన్నారు.

ఏ సమాచారాన్నైనా నమ్మే ముందు సంబంధిత అధికారుల ద్వారా లేదా విశ్వసనీయ వార్తా సంస్థల ద్వారా ధృవీకరించుకోవాలని సూచించారు. వదంతుల వ్యాప్తి వల్ల ప్రభుత్వ, ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లడంతో పాటు శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. ఎవరైనా మత విద్వేషం లేదా వదంతులు వ్యాప్తి చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే జిల్లా ఎస్పీ లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు తెలియజేయాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

Leave a Reply