హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : గోదావరంత ప్రేమను, సముద్రమంత వాత్సల్యాన్ని కవిత్వపు మాటల్లో అందరిపై గుమ్మరించే ఆనందానుభూతుల ప్రాణహిత కవి, విఖ్యాత సాహితీవేత్త సన్నిధానం నరసింహశర్మ ఒక వైపు, మనుషుల్ని, మనసుల్ని కదిలిస్తూ ఒక పవర్ ఫుల్ ఇన్విటేషన్ లా గుండె అరల్లోకి ఆత్మీయంగా ప్రవేశించే నిలువెత్తు మంత్ర స్తోత్ర చైతన్యం, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ మరోవైపు, ఆకస్మాత్తుగా తమకెంతో ఆత్మీయులైన విఖ్యాత రచయిత, సినీనటులు తనికెళ్ళ భరణి ఇంట సుమారు గంటసేపు ఎన్నో ప్రాచీన ఆధునిక కవిత్వ విశేషాలతో పారవశ్యపు ముచ్చటగా గడపడం విశేషం.
వయస్సులో ఏడుపదులు దాటినా కవిత్వపు ఘుమ ఘుమలు తగ్గని సన్నిధానం నరసింహశర్మను తమ ఇంటికి తీసుకొచ్చిన పురాణపండను భరణి అభినందించారు. ఈ సందర్భంగా తనికెళ్ళ భరణికి నరసింహశర్మ తన రచనలు బహూకరించారు. దశాబ్దాల వెనుక నుంచి, ఆరుద్ర, మధునాపంతుల, మల్లంపల్లి శరభేశ్వరశర్మ, బొమ్మకంటి సుబ్రహ్మణ్య శాస్త్రిలకు సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించుకోవడం గమనార్హం. అనంతరం సన్నిధానం నరసింహశర్మను ఆలింగనం చేసుకుని దుశ్శాలువా కప్పి సత్కరించారు భరణి. ఏదేమైనా సౌందర్యలహరి పేరుతో ఉన్న తనికెళ్ళ భరణి ఇంట, పురాణపండ సాక్షిగా సన్నిధానం నరసింహశర్మ కాస్సేపు కవిత్వ ఉత్సవాన్ని మెరిపించడం ముదావహంగా చెప్పక తప్పదు.
