ఇటీవలే ఇంగ్లండ్తో జరిగిన టీ20, వన్డే సిరీస్లను టీమిండియా కైవసం చేసుకుంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఛాంపియన్స్ ట్రోఫీపైనే ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుండగా, మ్యాచ్లు పాకిస్థాన్ వేదికగా హైబ్రిడ్ పద్ధతిలో జరగనున్నాయి.
తాజాగా, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వార్మప్ మ్యాచ్ల షెడ్యూల్ను ఐసీసీ ప్రకటించింది. ఫిబ్రవరి 14 – 17 వరకు వార్మప్ మ్యాచ్లు జరగనుండగా.. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్లు ఆడనున్నాయి. అయితే భారత్తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు మాత్రం వార్మప్ మ్యాచ్లు ఆడడం లేదు.
ఆటగాళ్లపై పనిభారం ఎక్కువగా ఉండడంతో వార్మప్ మ్యాచ్ లు వద్దని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 12న ఇంగ్లండ్తో భారత్ మూడో వన్డే ఆడగా.. 15న చాంపియన్స్ ట్రోఫీ కోసం యూఏఈ బయల్దేరనుంది. ఆ తర్వాత నాలుగు రోజుల్లో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో వార్మప్ మ్యాచ్ లు రద్దు చేసినట్టు తెలుస్తొంది.
కాగా, భారత జట్టు తన తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో ఆడనుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే దాయాదుల పోరు ఫిబ్రవరి 23న జరగనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ వార్మప్ షెడ్యూల్..
- ఫిబ్రవరి 14 : పాకిస్తాన్ షాహీన్స్ vs ఆఫ్ఘనిస్తాన్, గడాఫీ స్టేడియం (లాహోర్)
- ఫిబ్రవరి 16 : న్యూజిలాండ్ vs ఆఫ్ఘనిస్తాన్, నేషనల్ స్టేడియం (కరాచీ)
- ఫిబ్రవరి 17 : పాకిస్తాన్ షాహీన్స్ vs దక్షిణాఫ్రికా, నేషనల్ స్టేడియం (కరాచీ)
- ఫిబ్రవరి 17 : పాకిస్తాన్ షాహీన్స్ vs బంగ్లాదేశ్, ఐసీసీ క్రికెట్ అకాడమీ (దుబాయ్)
మెగా టోర్నీకి స్టార్లు దూరం !
మరోవైపు ఈ ఐసీసీ ఈవెంట్లో పాల్గొంటున్న దేశాలన్నీ తమ తుది జట్లను ప్రకటించేశాయి. అయితే, పలు జట్లలోని కీలక ఆటగాళ్లు ఈ టోర్నీకి దూరమయ్యారు. మ్యాచ్లను మలుపు తిప్పే సత్తా ఉన్న కీలక క్రికెటర్లు లేకుండానే ఆయా జట్లు ఈ మెగా టోర్నీలో అడుగుపెడుతున్నాయి.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఆటగాళ్లు వీరే !
- జస్ప్రీత్ బుమ్రా (భారతదేశం) – బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ నుండి వైదొలిగాడు.
- జాకబ్ బెథెల్ (ఇంగ్లండ్) – భారత్తో వన్డే సిరీస్ సందర్భంగా హామ్ స్ట్రింగ్ గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు.
- పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) – BGT సిరీస్ తర్వాత చీలమండ గాయంతో బాధపడుతున్నాడు.
- మిచెల్ మార్ష్ (ఆస్ట్రేలియా) – వెన్ను సమస్యతో మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు.
- మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) – వ్యక్తిగత కారణాలతో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలిగాడు.
- జోష్ హేజిల్వుడ్ (ఆస్ట్రేలియా) – బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో తుంటి గాయంతో బాధపడ్డాడు.
- ఎన్రిచ్ నోర్ట్జే (దక్షిణాఫ్రికా) – గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం.
- అల్లా ఘజన్ఫర్ (ఆఫ్ఘనిస్తాన్) – వెన్నెముక గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుండి తప్పుకున్నాడు.