- కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
హైదరాబాద్ నగరానికి మరో 800 ఎలక్ట్రిక్ బస్సులు (#EV) కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.
ఇటీవల హైదరాబాద్కు 2 వేల ఈవీ బస్సులు కేటాయించారని, ప్రస్తుత నగర అవసరాలను దృష్టిలో పెట్టుకొని పీఎం-ఈ డ్రైవ్ పథకం కింద అదనంగా మరో 800 బస్సులు కేటాయించాలని కోరారు. ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్లు బస్సు నిర్వహణ చూసేలా హైబ్రిడ్ జీసీసీ మోడల్ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ ఆర్టీసీ డీజిల్ బస్సుకు రెట్రోఫిట్టెడ్ చేపట్టగా అది సఫలమైందని, ఆ బస్సు నగరంలో రాకపోకలు సాగిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులకు రెట్రో ఫిట్మెంట్ అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.