అమెరికన్ ప్రతినిధుల బృందంతో సీఎం భేటీ..

హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో హడ్సన్ ఇనిస్టిట్యూట్ కు చెందిన 16 మంది అమెరికన్ ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ బృందంలో వివిధ రంగాల మేధావులు, బిజినెస్ లీడర్లు, దాతలు, అలాగే వాల్ స్ట్రీట్ జర్నల్ కాలమిస్ట్ ప్రొఫెసర్ వాల్టర్ రస్సెల్ మీడ్, రేషనల్‌వేవ్ క్యాపిటల్ పార్టనర్స్ CEO మార్క్ రోసెన్‌బ్లాట్, క్రౌ హోల్డింగ్స్ చైర్మన్ హర్లాన్ క్రో వంటి ప్రముఖులు ఉన్నారు.

ఇండియా ఫౌండేషన్ సారధ్యంలో భారత్‌లోని వివిధ రాష్ట్రాలలో పర్యటిస్తున్న ఈ బృందం, భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార, వాణిజ్య వ్యవహారాలు, విధానాలపై అభిప్రాయాలను సేకరిస్తోంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అమెరికా తీసుకునే నిర్ణయాలు, అనుసరించే విధానాలు సానుకూల దృక్పథంతో అమెరికా-భారత్ మధ్య సంబంధాలను మరింత పెంపొందించేలా ఉండాలని ఆకాంక్షించారు.

ఇటీవల అమెరికా పెంచిన సుంకాలు (Tariffs), హెచ్-1బీ వీసాలపై విధించిన కఠిన నిబంధనలు వంటి అంశాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడమే కాక, రెండు దేశాల మధ్య అస్థిరత, అపార్థానికి దారి తీస్తాయని పేర్కొన్నారు. ఇరు దేశాల ఆర్థిక వృద్ధికి దోహదపడే విధానాలు అనుసరిస్తే ప్రపంచానికి ఆదర్శంగా నిలవవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలను వివరిస్తూ, ముఖ్యమంత్రి తమ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్‌ను వివరించారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో పాలకులు మారినా ఉత్తమమైన విధానాలను కొనసాగిస్తామని, విధానాలను మార్చవలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్ ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాల పెట్టుబడులకు గమ్యస్థానంగా, దేశీయ-విదేశీ దిగ్గజ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. న్యూయార్క్, టోక్యో, దక్షిణ కొరియాతో హైదరాబాద్ పోటీ పడుతోందని, మౌలిక సదుపాయాలు, తయారీ సామర్థ్యాలను మెరుగుపరచడం ప్రపంచ ప్రమాణాలకు సవాలుగా ఉందని అన్నారు.

జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో తెలంగాణ అనూహ్య పురోగతి సాధించిందని, 2034 నాటికి రూ.1 ట్రిలియన్, 2047 నాటికి రూ.3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉందని సీఎం వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రైల్, ఫ్యూచర్ సిటీ, మాన్యుఫాక్చర్ జోన్లు వంటి గేమ్-ఛేంజర్ ప్రాజెక్టులు హైదరాబాద్‌లో అభివృద్ధి చెందుతున్నాయని, అలాగే డ్రై పోర్ట్ ఏర్పాటు చేసి మచిలీపట్నం పోర్ట్ వరకు 12-లేన్ గ్రీన్ ఫీల్డ్ హైవే , రైల్ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

హైదరాబాద్–చైన్నై, హైదరాబాద్–బెంగళూరు బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు ఉన్నాయని, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు కొత్త మార్గాలను తెరవనుందని తెలిపారు. సుమారు 30,000 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీలో అమెరికా పరిశ్రమల భాగస్వామ్యాన్ని, మద్దతును ముఖ్యమంత్రి ఆహ్వానించారు.

ఇప్పటికే ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 50 కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయని, మొత్తం 500 కంపెనీలు పెట్టుబడులకు ముందుకు రావాలని ఆకాంక్షించారు. ‘చైనా +1’ వ్యూహానికి తెలంగాణ అత్యుత్తమ ఎంపికగా ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న పరిశ్రమలు & ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ఏఐ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేసే ప్రణాళిక ఉందని, రాష్ట్రాన్ని దేశానికి స్కిల్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దాలనే కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు. ప్రఖ్యాత కంపెనీలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గ్లోబల్ కెపాసిటీ సెంటర్లను గ్లోబల్ వాల్యూ సెంటర్‌లుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో పరిశ్రమలు & ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు సీఎం సలహాదారు వేం నరేంద్ర రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply