- పార్ట్ వన్ లో ప్రజాప్రతినిధికి చుక్కలు
- పార్ట్ 2 లో నల్లమల ఆఫీసర్లకు చెమటలు
- ఇది సస్సెన్స్ థ్రిల్లింగ్ పొలిటికల్ వర్సెస్ బ్యూరోక్రసీ వార్
(ఆంధ్రప్రభ, నంద్యాల బ్యూరో) : నల్లమల టైగర్ జోన్ (Nallamala Tiger Zone) లో.. భీమ్లా నాయక్ 2 సీన్ .. మీడియా తెరమీదకు వచ్చింది. తీవ్ర సంచలనం క్రియేట్ చేసింది. ఆటోమేటిక్ గా బ్యూరోక్రసీ, పొలిటికల్ వార్ సీన్ గా మారిపోయింది. భీమ్లా నాయక్ (Bhimla Nayak) సినిమాలో.. అపరాత్రి మద్యం నిషాలో వెళ్తున్న ప్రజాప్రతినిధిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. తాజాగా నల్లమల అడవిలో అధికారులకే ప్రజాప్రతినిధి చుక్కలు చూపించారు. అధికారుల జీపులోనే తెల్లవారుజామున రెండు గంటల వరకూ తిప్పుతూ.. దప దప పిడిగుద్దులు వడ్డిస్తూ ఆ ప్రజ్రాప్రతినిధి అసురగణం చెలరేగిపోయింది. విధుల్లోని తమను ఈ ప్రజాప్రతినిధి అనధికారికంగా అదుపులోకి తీసుకుని శారీరకంగా.. మానసికంగా వేధించారని అటవీశాఖ అధికారులు పోలీసు శాఖకు మొరపెట్టుకున్నారు.
ఈ ఘటనపై సాక్షాత్తు సీఎం చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan చలించిపోయారు. ఆ ప్రజాప్రతినిధిపై కేసు నమోదు చేయాలని.. జరిగిన ఘటనపై నివేదిక సమర్చించాలని అధికారులను ఆదేశించారు. ఇంతకీ నల్లమల అడవిలో చోటు చేసుకున్న ఈ భీమ్లానాయక్ 2 ఇతి వృత్తం ఏంటీ? తదుపరి వర్యావసన పరిణామాలు దారి ఏంటీ? నిజంగా ఎమ్మెల్యే ఈ రీతిలో ఎందుకు ప్రవర్తించారు? అధికార దర్పంతో అటవీశాఖ అధికారులకు రుచి చూపించారా? నిజంగా ఇక్కడ అటవీశాఖ సిబ్బంది మామూళ్ల వేట సాగుతోందా? దళిత, గిరిజన, మైనార్జీ సిబ్బందిపై దాడి జరిగితే.. కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతోంది? కడకు బాధితులు, ప్రజాప్రతినిధి మధ్య రాజీ కుదురుతుందా? ఈ డీల్ ప్లాన్ సిద్ధమవుతోందా? ఇలా నరాలు తెగే సస్పెన్స్ ..థ్లిల్లర్ లో ఎలాంటి ట్విస్టులు వెలుగులోకి రానున్నాయి? అయితే.. నల్లమలలో భీమ్లానాయక్ ఎపిసోడ్ కథ తెలుసుకోవాల్సిందే.
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి(Srisailam MLA Budda Rajasekhara Reddy) పై శ్రీశైలం వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు (case registered) చేశారు. అటవీ శాఖ ఉద్యోగులపై దాడి జరిపించారని ఆయనపై బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డెప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యే అయినప్పటికీ రాజశేఖరరెడ్డిని ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.
నల్లమలలో ఏం జరిగింది?
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కారును మంగళవార రాత్రి పది గంటల సమయంలో శిఖరం చెక్పోస్ట్ దగ్గర అటవీశాఖ సిబ్బంది ఆపారు. ఎమ్మెల్యే కారును తనిఖీ చేయడానికి సిద్ధమయ్యారు. ఇది ఎమ్మెల్యే కారు, వదిలేయాలని , రాజశేఖరరెడ్డి అనుచరులు సహజ రీతిలో ఆదేశించారు. కానీ అటవీశాఖాధికారులకూ ఈ సమాచారం ఇచ్చారు. ఉన్నతాధికారుల నుంచి చెక్ పోస్టు సిబ్బందికి ఎలాంటి ఆదేశం రాలేదు. సిబ్బంది తమ పని తాము మొదలు పెట్టారు. ఇక ఎమ్మెల్యే కోపంతో అటవీశాఖ సిబ్బంది జీపు దగ్గరకు వెళ్లారు. జీపులోని ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ నెక్కటి రేంజ్ , డిప్యూటీ రేంజి అధికారి డి.రామ్నాయక్, ఇన్ఛార్జి సెక్షన్ అధికారి జె.మోహన్కుమార్, అటవీ బీట్ అధికారి టీకే గురవయ్య, డ్రైవర్ షేక్ కరీముల్లాను బయటకు పిలిపించారు.
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ కరీముల్లా చెంపపై రెండు దెబ్బలు కొట్టారు. మోహన్కుమార్, గురవయ్యలనూ బండ బూతులు తిడుతూ చేయి చేసుకున్నారు.అప్పటికీ ఆయన కోపం చల్లారలేదు. ఇక అధికారుల జీపులో కూర్చోవాలని తన అనుచరులను ఆదేశించారు. ఎమ్మెల్యేనే ఆ వాహనాన్ని డ్రైవ్ చేసుకుంటూ సున్నిపెంట, శ్రీశైలం ప్రాంతాలకు వెళ్లారు. ఇక దారిలో ఎమ్మెల్యే అనుచరులు ఇద్దరు ఉద్యోగులను కొట్టారు. కొట్టడం సరైన పద్ధతి కాదని ఓ ఉద్యోగి చెబుతున్నా వినిపించుకోలేదు. పిడిగుద్దులు కురిపించారు. ఉద్యోగుల వాకీటాకీలు, సెల్ఫోన్లు, పర్సులు, జేబులోని నగదు లాక్కున్నారు. శ్రీశైలంలో వాహనాన్ని తెల్లవారుజామున రెండు గంటల వరకు తిప్పుతూ కొడుతూనే ఉన్నారు. అనంతరం వీరందరినీ ఓ కాటేజీకి తీసుకెళ్లి బంధించారు రెండు గంటల ప్రాంతంలో విడిచిపెట్టారు.ఇక తమపై దాడి జరిగిందని బాధితులు అటవీశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల సూచనతో శ్రీశైలం పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
వసూళ్లు చేస్తున్నారు..
శ్రీశైలంఈ ఘటనపై ఎమ్మెల్యే రాజశేఖరరెడ్డి వాదన వేరుగా ఉంది. ఆయన ఏమన్నారంటే…”శిఖరం, డోర్నాల చెక్పోస్ట్ల దగ్గర సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. రాత్రి 9 గంటల తర్వాత వచ్చే వాహనదారుల నుంచి రూ.2వేల వరకు తీసుకుంటున్నారు. మంగళవారం రాత్రి నా వాహనాన్నీ ఆపేశారు. రాత్రి 9 తర్వాత వాహనాలపై నిషేధం ఉంటే ఘాట్రోడ్డులో అన్ని వాహనాలు ఎలా ఉన్నాయి? బ్రీత్ ఎనలైజర్లు పట్టుకుని భారీఎత్తున జరిమానా వసూలు చేస్తున్నారు. శ్రీశైలం పరిసరాల్లోని అటవీ భూముల్లో పలు ఆక్రమణలున్నాయి. అటవీశాఖ అధికారులకు అవి కనిపించట్లేదు. దీంతోపాటు అటవీప్రాంతం పేరు చెప్పి ప్రతి అభివృద్ధి పనికీ అడ్డం తగులుతున్నారు. ఒక్క రోడ్డుకూ అనుమతులు ఇవ్వట్లేదు. అందుకే వారి వాహనంలో వారిని తీసుకెళ్లి శ్రీశైలంలో నేను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించాను. వారిని గట్టి ప్రశ్నించిన విషయం వాస్తవమే. అధికారులను ప్రశ్నించాను గానీ వారు దళితులా? గిరిజనులా? అన్న విషయం నాకెలా తెలుస్తుంది? అటవీశాఖాధికారులు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. నేను కూడా విలేకరుల సమావేశం పెట్టి వాస్తవాలు వివరిస్తాను” అన్నారు. తాను ఎవరిపైనా దాడి చేయలేదని చెప్పారు.
చంద్రబాబు ఆగ్రహం..
శ్రీశైలం శిఖరం చెక్పోస్టు వద్ద అటవీ ఉద్యోగులపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి దాడి చేశారన్న ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంఓ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తరచుగా ఆయన వివాదాల్లో చిక్కుకోవడంపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి విచారణ చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. వివాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు.
నివేదిక ఇవ్వండి : డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్..
శ్రీశైలంలో అటవీశాఖ ఉద్యోగులపై దాడి ఘటనలో ఎమ్మెల్యే, ఆయన అనుచరుల ప్రమేయంపై విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ తెలిపారు. నిబంధనల ప్రకారం బాధ్యులపై కేసులు నమోదు చేయాలని స్పష్టం చేసినట్లు చెప్పారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘‘ఉద్యోగులపై దాడి చేసిన వారు ఏ స్థాయి వ్యక్తులైనా సరే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
సీసీ పుటేజీలో .. సీన్ లు
ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అటవీశాఖ ఉద్యోగులను బెదిరించడం, ఓ ఉద్యోగి చెంపపై కొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆ సీసీ ఫుటేజీని అటవీశాఖ అధికారులు విడుదల చేశారు. మద్యం మత్తులో ఫారెస్ట్ అధికారులను శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కొట్టినట్టు ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆరోపించింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేసింది. రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బందిని అడ్డుకుని చెక్ పోస్ట్ వద్దే డ్రైవర్ పై దాడి చేసినట్టు తెలిపింది. అటవీ శాఖ సిబ్బంది తనను కలవడానికి రావడం లేదని, రోజు తన ఇంటికి వచ్చి హాజరు వేయించుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరిక చేశారని, అలా వీలుకాదన్నందుకు మీ అంతు చూస్తా అంటూ సిబ్బందిపై తీవ్ర పదజాలంతో దుర్బాషలాడినట్టు సంఘం ఆరోపించింది. ఎమ్మెల్యేనే తమపై దాడి చేస్తే, తాము ఎలా విధులు నిర్వహించాలని సిబ్బంది వాపోయారు. ఫారెస్ట్ అధికారులు రామానాయక్, గురవయ్య, మోహన్ కుమార్, కరీముల్లాలపై దాడి చేసినట్టు సంఘం పేర్కొంది.
వివాదాలే.. వివాదాలు..
ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పొలిటికల్ కెరీర్ మొత్తం సెన్సెటివ్ తో ఉత్కంఠ రేపుతుంది. శ్రీశైలం నుంచి టీడీపీ అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో గెలిచిన ఆయనపై గతంలో పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మైనేత రికార్డుల ప్రకారం ఆయనపై రెండు కేసుల్లో ఐపీసీ సెక్షన్ 506 (క్రిమినల్ ఇంటిమిడేషన్ – భయపెట్టడం) కింద ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఒక కేసులో ఐపీసీ సెక్షన్ 326 (ఆయుధాలతో తీవ్ర గాయాలు కలిగించడం) కింద ఛార్జ్లు ఉన్నాయి. ఇవి ఆయన రాజకీయ ప్రత్యర్థులు, స్థానిక గ్రూప్ తగాదాల కారణంగా నమోదైన కేసులు. జూలై 5, 2025న ఆయన అనుచరులు మాజీ మంత్రి, టీడీపీ వైస్ ప్రెసిడెంట్ ఎరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఆయన అనుచరులు నంద్యాల ఎంపీ శబరిని కూడా చుట్టుముట్టి గెరావ్ చేశారు. ఇది పార్టీ అంతర్గత వివాదాల నుంచి పుట్టినదిగా చెబుతున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.2024 ఎన్నికల ప్రచారంలో వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అత్మకూర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఇది ఎన్నికల నిబంధనల ఉల్లంఘనగా కేసుగా పరిగణలోకి తీసుకున్నారు. జనవరి 2022లో ఆయన కుటుంబానికి చెందిన బుడ్డా శ్రీకాంత్ రెడ్డి (బీజేపీ ఇన్ఛార్జ్)తో సంబంధం ఉన్న గ్రూప్ ఘర్షణల్లో 10 మంది గాయపడ్డారు. ఇది స్థానిక రాజకీయ శత్రుత్వాల నుంచి వచ్చింది.గతంలో ఆయనపై ఐపీసీ సెక్షన్ 290 (పబ్లిక్ న్యూసెన్స్), 341 కింద కూడా కేసులు నమోదయ్యాయి. ఇవి 2014 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు రికార్డు అయ్యాయి. నంద్యాల ఎంపీని నిలదీయడం, పార్టీ అంతర్గతంగా వివాదాలు సృష్టించడం వంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. తాజా పరిణామాలు .. ఆయన పొలిటికల్ స్టోరీని ఏ మలుపు తిప్పుతుందో? వేచి చూడాల్సిందే.
కూటమి చర్యే ప్రశ్నార్థకం..
శ్రీశైలం సంఘటనపై విశ్లేషణ ఆగస్టు 19 రాత్రి శ్రీశైలం శిఖరం చెక్పోస్ట్ వద్ద జరిగిన సంఘటనలో ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అటవీ అధికారులు (డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ డి. రామ్ నాయక్, ఇంచార్జి సెక్షన్ ఆఫీసర్ జె. మోహన్ కుమార్, బీట్ ఆఫీసర్ టీకే గురవయ్య, డ్రైవర్ షేక్ కరిముల్లా)ను కిడ్నాప్ చేసి, దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. వారిని వారి వాహనంలోనే తీసుకెళ్లి సున్నిపెంటలో వీధుల్లో తిప్పి, కొట్టి, మొబైల్ ఫోన్లు, వాకీటాకీలు, నగదు లాక్కున్నారు. బాధితులు శ్రీశైలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చట్టపరమైన చర్యలు అధికారులను బలవంతంగా తీసుకెళ్లడం, గాయ పరచడం, కొట్టడం వంటి సంఘటనలకు సీసీటీవీ ఫుటేజీలు ఆధారాలుగా ఉన్నాయి. మొత్తంగా ఈ సంఘటనపై నమోదైన సెక్షన్ ల ఆధారంగా 10 సంవత్సరాల వరకు నిందితులకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మద్యం సేవించి దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి పబ్లిక్ సర్వెంట్లపై దాడి ఐపీసీ 353 కూడా వర్తిస్తుంది. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. సీఎం ఆదేశాలతో విచారణ వేగవంతమవుతుంది. టీడీపీ నుంచి సస్పెన్షన్ లేదా పార్టీ తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.