ఓటరు సర్, సవరణ గడువు నెల పొడిగించాలి
- తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన ఏ వైయస్ నాయకులు
చిట్యాల, ఆంధ్రప్రభ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ గడువును మరో నెల రోజుల పాటు పొడిగించాలని అంబేద్కర్ యువజన సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ అనిల్కు వినతిపత్రం అందజేసింది.
ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రస్తుతం ఉన్న గడువు సరిపోదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద గ్రామపంచాయతీల్లో ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటంతో బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) తగినంత సంఖ్యలో లేరని తెలిపారు.
చిట్యాల గ్రామపంచాయతీలో సుమారు 5 వేల మంది ఓటర్లు ఉన్నప్పటికీ కేవలం నలుగురు బీఎల్ఓలను మాత్రమే నియమించడం సరిపోదని అన్నారు. రాష్ట్ర, జిల్లా, మండల ఎన్నికల అధికారులు పెద్ద గ్రామపంచాయతీల్లో అదనంగా బీఎల్ఓలను నియమించి, ఓటరు జాబితా సవరణ గడువును నెల రోజుల పాటు పొడిగించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం టేకుమట్ల మండల కన్వీనర్ మారేపల్లి కొమురయ్య, మండల ప్రచార కార్యదర్శి కట్కూరి రాజు, నాయకులు గురుకుంట్ల కిరణ్, గుర్రపు తిరుపతి, మొగిలి తదితరులు పాల్గొన్నారు.
