పచ్చని భూమి కోసం పదిలమైన అడుగులు..
ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలి.. వాటిని సంరక్షించాలి
పర్యావరణం కోసం మనం వేసే బాట భావితరాలకు భరోసా
కలెక్టరేట్లో మొక్కలు నాటిని కలెక్టర్ లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : పచ్చని భూమికోసం, భావితరాల భద్రత కోసం ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనం పెంపొందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, చెట్లు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు.
ప్రకృతి మనకు అందించిన అమూల్యమైన సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందన్నారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రతల పెరుగుదల వంటి సవాళ్లను అధిగమించాలంటే చెట్ల పెంపకం అత్యంత అవసరమని పేర్కొన్నారు. చెట్లు మనకు ప్రాణవాయువును అందించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడతాయని, భూగర్భ జలాల పరిరక్షణకు, జీవ వైవిధ్య సంరక్షణకు దోహదపడతాయని తెలిపారు. నేడు మనం నాటే ప్రతి మొక్క భావితరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన భూమిని అందించే పెట్టుబడిగా నిలుస్తుందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
