Bengal Bjp | హిందుత్వ పార్టీల వైఫల్య కారణాలు

Bengal Bjp | హిందుత్వ పార్టీల వైఫల్య కారణాలు

Bengal Bjp | బీజేపీకి చారిత్రక నేపథ్యం
బెంగాల్‌లో తొలి ఎన్నికల విశ్లేషణ
వామపక్షాలు, కాంగ్రెస్ ఎదుగుదల
బీజేపీ ఓటు షేర్ ప్రయాణం
తృణమూల్ కాంగ్రెస్ ప్రభావం
బీజేపీ ఎదుర్కొంటున్న సవాళ్లు

Bengal Bjp | బీజేపీకి పూర్వ నామం భారతీయ జనసంఘ్‌. ఆ పార్టీని నెలకొల్పిన డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ బెంగాలీ వారే. ఏడుదశాబ్దాల క్రితం భారతీయ జనసంఘ్‌ను ఆయన స్థాపించారు. ఆయన స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. పండిట్‌ నెహ్రూ నేతృత్వంలోని తొలి మంత్రివర్గంలో మంత్రిగా వ్యవహరించారు. సైద్ధాంతిక విభేదాలతో వైదొలగారు. అటువంటి పార్టీ బెంగాల్‌లో ఎదగకపోవడానికి ప్రధాన కారణం, పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సమర్థులైన బెంగాల్‌ నాయకులు లేకపోవడమే.

మొదటి సాధారణ ఎన్నికల్లో (1951–52) రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి స్పష్టంగా బయటపడింది. జనసంఘ్‌, హిందూ మహాసభలకు వరుసగా ఆరు, నాలుగు శాతం ఓట్లు లభించాయి. వామపక్షాలకు 29 శాతం, కాంగ్రెస్‌కు 42 శాతం ఓట్లు వచ్చాయి. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలకు ఎక్కువ ఓట్‌ షేర్‌ లభించింది. మితవాద పార్టీలకు తొలి ఎన్నికల్లోనే తగిన ప్రాతినిధ్యం దక్కలేదు. అప్పట్లో రాష్ట్రంలో మతపరమైన చీలికలు కనిపించాయి. ఇండిపెండెంట్లకు 22 శాతం ఓట్లు వచ్చాయి.

వామపక్షాలు తమ పరిధిని ప్రజా ఉద్యమాల ద్వారా విస్తరించుకున్నాయి. ముఖ్యంగా కార్మిక సమస్యలు, పౌర హక్కుల సమస్యలపై పోరాటాల ద్వారా ప్రజల్లో పట్టును సంపాదించాయి. అలాగే వ్యవసాయ కార్మికుల్లో కూడా మంచి ఆదరణ పొందాయి. కాంగ్రెస్‌ స్వాతంత్ర్య ఉద్యమం నాటి జోష్‌తో ఉండేది. దేశంలో మితవాద పార్టీలు పూర్తిగా హిందుత్వ పరిరక్షణకే పరిమితం అయ్యాయి.

బెంగాల్‌ దేశ విభజన సమయంలో నౌఖాలి ఘర్షణలను పురస్కరించుకుని ముస్లింలీగ్‌ 1946 ఆగస్టు 16న ప్రత్యక్ష చర్య దినాన్ని పాటించాలని పిలుపునిచ్చింది. తూర్పు బెంగాల్‌ నుంచి హిందూ బెంగాలీ శరణార్థులు బెంగాల్‌కు తరలివచ్చారు. హిందూ మహాసభకు తగిన నెట్‌వర్క్‌ లేకపోవడంతో హిందూ బెంగాలీ శరణార్థులను ఆదుకోలేకపోయింది. 1946 ఎన్నికల్లో హిందూ మహాసభకు కేవలం 2 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రఫుల్ల ఘోష్‌ హిందూ మహాసభను ఓడించారు. బెంగాల్‌ తొలి ముఖ్యమంత్రి ఆయనే. ఆయన 1947 నవంబర్‌లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

హిందుత్వ పార్టీలు బెంగాల్‌లో ఎందుకు విఫలమవుతున్నాయి? హిందుత్వ పార్టీలకు వ్యవస్థాగత సమస్యలు, స్వాతంత్ర్యం అనంతరం మహాసభ నుంచి ముఖర్జీ రాజీనామా, మహాత్మా గాంధీ హత్య అనంతరం ప్రభుత్వం హిందూ మహాసభ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవడం వంటి కారణాల వల్ల ఆ సంస్థ బలహీనపడింది. మరో కారణం ఏమిటంటే, శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ మరణానంతరం ఆయన స్థాపించిన భారతీయ జనసంఘ్‌, రామరాజ్య పరిషత్‌ వంటి పార్టీలు ప్రజలపై ప్రభావం చూపలేకపోయాయి. ఈలోగా వామపక్షాలు, కాంగ్రెస్‌లు తమ ప్రభావాన్ని విస్తరించుకున్నాయి.

భారతీయ జనసంఘ్‌ ఆ తర్వాత బీజేపీగా మారినా, 1991 ఎన్నికల వరకు ఒక శాతం ఓట్లను కూడా సాధించలేకపోయింది. 1991లో రామజన్మభూమి ఉద్యమం కారణంగా 11 శాతం ఓట్లు సాధించింది. 2016లో ఆ పార్టీ 10 శాతం దాటింది. 2019లో 40 శాతం ఓట్లు సాధించింది. 2021లో కొద్దిగా తగ్గి 38 శాతం, 2024లో మళ్లీ పెరిగి 39 శాతం ఓట్లు సాధించింది.

మొదటి నుంచి బీజేపీ రాష్ట్రంలో ఎదగకపోవడానికి ప్రధాన కారణం వ్యవస్థీకృత బలం లేకపోవడం, ఓటర్‌ బేస్‌ లేకపోవడమే. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఆయన ప్రభావంతో పార్టీ క్రమంగా బలపడుతోంది. పూర్వపు వామపక్ష మద్దతుదారుల ఓట్లను కూడా క్రమంగా ఆకర్షిస్తోంది.

మరోవైపు తృణమూల్‌ కాంగ్రెస్‌ అటు గ్రామాల్లోనూ, ఇటు పట్టణాల్లోనూ తన ప్రభావాన్ని పెంచుకుంటూ ఎదిగింది. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నగదు బదిలీ పథకాలు వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి ప్రజలను ఆకర్షించింది. ఈ విధంగా కాంగ్రెస్‌ కార్యకర్తలను కూడా సమీకరించింది.

ఇతర రాష్ట్రాల్లో అధికార పార్టీలపై వ్యతిరేకత కనిపిస్తుంటుంది. కానీ బెంగాల్‌లో అది పెద్దగా కనిపించకపోవడం కూడా తృణమూల్‌ ఎదుగుదలకు ఒక కారణం.

బీజేపీకి ఏం కావాలి?

ఉపాధ్యాయుల నియామకాల్లో, ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతి, రాష్ట్రంలో ఉద్యోగావకాశాల కొరత, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను కోర్టులు తిరస్కరించడం, మంత్రులు, నాయకుల అరెస్టులు, రాజకీయ అవినీతి వంటి అంశాలు ఎన్నికల ప్రచారంలో కనిపిస్తున్నాయి. అయినప్పటికీ బీజేపీ వీటిని సమర్థంగా వినియోగించుకోలేకపోతోంది.

బీజేపీ తన ప్రచారాన్ని ఎక్కువగా బంగ్లాదేశ్‌ నుంచి వలసలు, ఇస్లామిక్‌ రాడికలిజం వంటి అంశాలపై కేంద్రీకరిస్తోంది. హిందుత్వ సిద్ధాంతంపై స్పష్టత లోపిస్తోంది. ప్రధానంగా నరేంద్ర మోదీ, అమిత్‌ షా ఇమేజ్‌లపై ఆధారపడుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం కూడా సమర్థంగా చేయలేకపోతోంది. టీఎంసీ పాలనలో లోపాలను బలంగా ఎత్తిచూపడంలో విఫలమవుతోంది.

అంతేకాక, బీజేపీ నాయకత్వం స్థానికం కాదనే ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోతోంది. ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) విషయంలో మమతా బెనర్జీ చేస్తున్న ప్రచారానికి కూడా సమాధానం ఇవ్వడంలో వెనుకబడుతోంది. ఎన్నికల కమిషన్‌పై తృణమూల్‌ దాడిని తిప్పికొట్టడంలో విఫలమవుతోంది. మరోసారి ఓడిపోతే, బీజేపీ ఓట్‌ షేర్‌ను నిలబెట్టుకోవడం కూడా కష్టమే.

— చంద్రచూర్‌ ఘోష్‌
రచయిత, కాలమిస్టు, వక్త

Leave a Reply