నంద్యాల బ్యూరో, జూన్ 24 (ఆంధ్రప్రభ) : ఎగువన వర్షాల కారణంగా శ్రీశైలం రిజర్వాయర్ లో 857 అడుగులకు స్థాయికి కృష్ణా జలాలు చేరిన నేపథ్యంలో పోతిరెడ్డిపాడు, మల్యాల ఎత్తిపోతల పథకాల నుండి రాయలసీమ ప్రాజెక్టులకు తక్షణమే నీటిని విడుదల చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద వస్తున్న నేపథ్యంలో రాయలసీమ ప్రాజెక్టులకు నీటి విడుదల చేయాలని కోరుతూ జలవనరుల శాఖ ఛీఫ్ ఇంజనీర్, కర్నూలు వారికి మంగళవారం మెయిల్ ద్వారా బొజ్జా లేఖను పంపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… శ్రీశైలం రిజర్వాయర్ ను వరదల నుండి రక్షించడానికి, రాయలసీమ తాగు, సాగునీటి అవసరాలను తీర్చడానికి, రాయలసీమ హక్కులను కాపాడుకోవడానికి తక్షణమే పోతిరెడ్డిపాడు నుండి మల్యాల ఎత్తిపోతల పథకం నుండి రాయలసీమలోని వివిధ రిజర్వాయర్లకు, ప్రాజెక్టులకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో ప్రధానంగా కేసీ కెనాల్, తెలుగు గంగ, ఎస్ ఆర్ బి సి ఆయకట్టు కింద ఒక లక్ష ఎకరాలకు పైగా పొలాల్లో మొక్కజొన్న, సోయాబీన్, మినుము తదితర ఆరుతడి పంటలను రైతులు సాగు చేశారన్నారు. వాతావరణ శాఖ అంచనాలకు విరుద్ధంగా రుతుపవనాల గమనం మందగించడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ పంటలను కాపాడుకోవడానికి ప్రాజెక్టులకు తక్షణమే నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని బొజ్జా ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో కేసీ కెనాల్ పరిరక్షణ సమితి నాయకులు బెక్కం రామసుబ్బారెడ్డి, ఉప్పలపాటి బాలీశ్వరరెడ్డి, వై.యన్.రెడ్డి, న్యాయవాది సయ్యద్ అసదుల్లా, మహేశ్వరరెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు, భాస్కర్ రెడ్డి, మహమ్మద్ పర్వేజ్, కొమ్మా శ్రీహరి, జానో జాగో కన్వీనర్ మహబూబ్ భాష, రాఘవేంద్ర గౌడ్, తదితరులు పాల్గొన్నారు.