Twit | అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణ చేసారు – కేటీఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ ఏడాది పాలనలో అన్ని రంగాలు కుదేలయ్యాయని, రైతులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆకలిచావులు, ఆత్మహత్యల తెలంగాణను పదేండ్ల పాలనతో కేసీఆర్ దేశానికే అన్నపూర్ణగా నిలబెట్టారని చెప్పారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణను చేశారని మండిపడ్డారు.ఇది ప్రజాపాలన కాదని, ప్రజలను వేధించే పాలన అంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు.
హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో తెలంగాణ రియల్ ఎస్టేట్ను కుదేలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టిన పెట్టుబడులు రాక, మిత్తి కూడా ఎల్లక ఉసురు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పదేండ్ల పాలనలో వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చి కేసీఆర్.. రైతులలో ఆత్మవిశ్వాసం నింపి, వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలిచారని తెలిపారు. ఏడాది రేవంత్ పాలనలో సాగునీళ్లు లేక, కరంటు రాక, పంటలు కొనుగోలు చేయక, రైతుభరోసా లేక, రుణమాఫీగాక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు.