నల్లగొండ, ఆంధ్రప్రభ ప్రతినిధి : మిస్వరల్డ్-2025 పోటీలకు వచ్చిన ప్రపంచ అందగత్తెలు నాగార్జున సాగర్, బుద్ధవనం తదితర పర్యాటక ప్రాంతాలను సోమవారం సందర్శించనున్నారు. ఈ మేరకు నాగార్జున సాగర్, బుద్ధవనం తదితర పర్యాటక ప్రాంతాలను పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. సాగర్ పట్టణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు సాగర్లో విస్తృత బందోబస్తు చర్యలను తీసుకున్నారు.
క్షుణ్ణంగా తనిఖీలు…
ప్రపంచ అందగత్తెల భద్రతా దృష్ట్యా పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఏరియా డామినేషన్ బృందాల చేత అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాగార్జునసాగర్ లో దాదాపు వెయ్యి మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రపంచ సుందరీమణులు బుద్ధ వనాన్ని సందర్శించనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో డ్రోన్ల సంచారంపై పోలీసులు నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నాగార్జున సాగర్ వెళ్లే ప్రధాన రహదారితో పాటు సాగర్ లోని పలు పర్యాటక ప్రాంతాలను డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ లతో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు.