Inter Board | ప్రాక్టికల్ పరీక్షలకూ పటిష్ట నిఘా..
- తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించే సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 417 కాలేజీల్లో సీసీ కెమెరాలను అద్దెకు తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు.
మరోవైపు పరీక్షా కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 90 శాతం కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని కృష్ణ ఆదిత్య తెలిపారు. పరీక్ష సమయంలో పేపర్ ఓపెనింగ్ రూమ్, సెంటర్ ఎంట్రన్స్, కారిడార్, గ్రౌండ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
పరీక్షా కేంద్రాలను కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. అయితే కొన్ని కార్పొరేట్ కాలేజీలు సీసీ కెమెరాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాయని.. ఆ కాలేజీలకు పరీక్షా కేంద్రాలు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.