ఇచ్ఛాపురం, ఆంధ్రప్రభ : మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ లాభాల స్వర్ణమణిపై అనర్హత వేటుపడింది. ఏడవ వార్డు కౌన్సిలర్ గా ప్రాతనిధ్యం వహిస్తున్న ఆమె సమాచార హక్కు చట్టం, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా చట్టబద్దంగా పొందిన అనుమతుల మేరకు నిర్మించిన భవనాలపై ఫిర్యాదులు చేస్తున్నట్లు టేబుల్ అజెండా లో పేర్కొన్నారు. తరచూ వివాదాలు సృష్టించి స్వలాభం కోసం ఫిర్యాదులు చేసి అనంతరం వాటిని ఉపసంహరించుకున్నట్లు ప్రస్తావించారు. ఫిర్యాదుల వ్యవస్థను ప్రజాప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్లు గుర్తించినట్లు అందులో పొందుపరిచారు.
పురపాలక చట్టం 1965, సెక్షన్ 17 అనుసరించి మున్సిపల్ కమిషనర్ గత నెల 25న ఆమెకు లేఖ ద్వారా తెలియపరిచినట్లు అజెండాలో ప్రస్తావించారు. కొన్ని ఆధారాల వివరాలను టౌన్ ప్లానింగ్ అధికారి వినయ ప్రసాద్ కౌన్సిల్ కు వివరించారు. చివరకు కొద్ది మంది మినహా సొంత పార్టీ వైసీపీ సహా టీడీపీ సభ్యులు అనర్హత అంశంకు మద్దతు పలికారు. ఈలోగా చైర్ పర్సన్ పిలక రాజ్యలక్ష్మి మెజార్టీ సభ్యుల ఆమోదం కోరగా చేతులు పైకి ఎత్తి తమ మద్దతు తెలపడంతో ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై స్వర్ణమణి మండిపడ్డారు. తనకు కనీసం మాట్లాడే అవకాశం లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.