ఎన్టీఆర్ జిల్లా బ్యూరో, ఆంధ్రప్రభ : తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 15న విజయవాడలో మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నట్టు సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వివరించారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో ఈ మ్యూజికల్ నైట్ జరగనుంది. విజయవాడలో గురువారం విలేకరుల సమావేశంలో కార్యక్రమాల వివరాలను భువనేశ్వరి, తమన్ వివరించారు.
తలసేమియా బాధితులు శ్వాస తీసుకోడానికి కూడా ఇబ్బంది పడతారని, వారి కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. తమన్ కూడా ఒక్క నిమిషం ఆలోచించకుండా వెంటనే మ్యూజికల్ నైట్ కి వస్తా అన్నారని, తమన్ ఈ షో ఫ్రీ గా చేస్తా అని గొప్ప హృదయంతో చెప్పారని భువనేశ్వరీ తెలిపారు. కార్యక్రమానికి అతిథులుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ హాజరవుతున్నారని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ, తాను ఈ షో చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద కార్యక్రమం తనకు అప్పగించారని అన్నారు.ఈ షో ద్వారా వచ్చే ప్రతి రూపాయి తలసేమియా భాదితులకు వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు.