AP | స్వచ్ఛాంధ్ర, బీసీ సంక్షేమ శాఖ పై చంద్రబాబు సమీక్ష

స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర, బీసీ సంక్షేమ శాఖపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్చమైన మనుషులు, స్వచ్ఛమైన మనసులు, స్వచ్ఛమైన పరిసరాలు, స్వచ్ఛమైన ఇళ్లు, కాలనీలు, గ్రామాలు అని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని… ఇది ఏ ఒక్క శాఖకు, ఒక అధికారికి సంబంధించిన కార్యక్రమంగా చూడకూడదన్నారు.

గ‌త నెలలో ‘‘న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్’’ అనే అంశాన్ని థీమ్ గా తీసుకోగా.. ఈ నెలలో ‘‘సోర్స్ రీ సోర్స్’’ అనే అంశాన్ని థీమ్ గా తీసుకోవాలన్నారు. రాష్ట్ర వనరులను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి ఎలా సాధించాలనే దానిపై దృష్టి సారించాలని అధికారులకు సీఎం సూచించారు.

14 ఇండికేటర్లతో పట్టణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖలు నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రధమ స్థానంలో నిలిచిన ఎన్టీఆర్ జిల్లాను సీఎం అభినందించారు. మిగిలిన జిల్లాలు కూడా ప్రగతి సాధించాలని కోరారు.

జీవన ప్రమాణాలు పెంపొందించడం, పర్యాటకాన్ని ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం, రాష్ట్ర పర్యావరణాన్ని నికరంగా జీరోకు తీసుకురావడం లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో పాఠశాల విద్యార్థుల నుంచి నాయకుల వరకు బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

సంక్షేమ పాఠశాలలు రెసిడెన్షియల్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ !

అంతే కాకుండా బీసీ విద్యార్థుల డైట్ బకాయిలను వెంటనే చెల్లించాలని తెలిపారు. నసనకోట, ఆత్మకూరు బీసీ సంక్షేమ పాఠశాలలను రెసిడెన్షియల్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని అధికారులకు సీఎం సూచించారు. సబ్ కమిటీ నివేదిక రాగానే బీసీ రక్షణ చట్టాన్ని రూపొందించాలన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కోసం అవసరమయితే న్యాయ పోరాటం చేయాలన్నారు. ప్రతి కార్పొరేషన్‌కు దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *