BIG BREAKING | రాజధాని ఎక్స్ప్రెస్లో చెలరేగిన మంటలు

BIG BREAKING | రాజధాని ఎక్స్ప్రెస్లో చెలరేగిన మంటలు
BIG BREAKING | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలో ఆదివారం ఉదయం త్రివేండ్రం-హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రైలులోని బీ-1 ఏసీ కోచ్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు.
ఈ ఘటన రత్లాం జిల్లా పరిధిలోని లునీ రిచ్ఛా-విక్రమ్గఢ్ అలోట్ స్టేషన్ల మధ్య ఉదయం సుమారు 5:15 గంటల సమయంలో జరిగింది. మంటలు వ్యాపించిన కోచ్లో దాదాపు 68 మంది ప్రయాణికులు ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులను ఇతర బోగీలకు తరలించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని భావిస్తున్నప్పటికీ, అసలు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఘటన కారణంగా ఢిల్లీ-ముంబై ప్రధాన రైలుమార్గంలో కొంతసేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే శాఖ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రైలును తర్వాత గమ్యస్థానానికి పంపినట్లు అధికారులు తెలిపారు.
