ఆంధ్రప్రదేశ్లో ఆదివారం, సోమవారం కురిసిన అకాల వర్షాలపై సీఎం చంద్రబాబు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా సంబంధిత జిల్లాల కలెక్టర్లు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్ష ప్రభావిత జిల్లాల్లో జరిగిన పంట, ప్రాణ నష్టం గురించి అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు.
అకాల వర్షాలతో రాష్ట్రంలో 2,224 హెక్టార్లలో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్లు, 138 హెక్టార్లలలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు సీఎంకు వివరించారు. ఇక పిడుగుపాటుకు 10 మంది మరణించారని.. తిరుపతి జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు, బాపట్ల జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, ఏలూరు జిల్లాలో ఒకరు, నెల్లూరు జిల్లాలో ఒకరు మరణించినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
రేపటిలోగా నష్టపరిహారం చెల్లించాలి..
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి, నష్టపోయిన రైతులకు రేపు (మంగళవారం) సాయంత్రంలోగా పరిహారం అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
అంతేకాకుండా, పిడుగుపాటు కారణంగా మరణించిన బాధితుల కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలని ఆయన ఆదేశించారు. పిడుగుపాటుకు చనిపోయిన పశువులకు కూడా నిబంధనల ప్రకారం పరిహారం వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ మేరకు జిల్లాల్లో పరిస్థితిని బట్టి కలెక్టర్లు కింది స్థాయి అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు
రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఇంకా వర్ష సూచన ఉన్నందున.. కలెక్టర్లు, అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. విపత్తుల సమయంలో అధికారులు మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. అకాల వర్షాలకు ఆయా జిల్లాల్లో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను తక్షణం పునరుద్ధరించడంలో కృషి చేసిన విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు.
ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన ఆదేశాలు
రబీలో 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పౌర సరఫరాల శాఖ ప్రత్యేక కార్యదర్శి సౌరభ్ గౌర్ సీఎంకు వివరించారు. అందులో ఇప్పటికే 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ఆయన తెలిపారు. వర్షాల కారణంగా రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. పంట ఆశించిన దానికంటే ఎక్కువగా దిగుబడి వస్తే, అవసరమైతే కేంద్రంతో మాట్లాడి కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.