- గొండుగూడ సమీపంలో రోడ్డు దాటిన టైగర్
- చూసిన కార్మికులు, స్థానికులు
కాసిపేట, ఏప్రిల్ 8 (ఆంధ్రప్రభ) : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రం శివారులో మళ్ళీ పెద్దపులి కలకలం రేపింది. మంగళవారం ఉదయం గొండుగూడ గ్రామ సమీపంలో రోడ్డు దాటిపోతున్న పెద్దపులిని బొగ్గుగని కార్మికులు, స్థానికులు చూసినట్టు తెలిపారు. పులిని చూసిన వాహనదారులు, రోడ్డుపైనే ఆగి, అది దాటి దూరం వెళ్ళిపోయాక వారి వారి వాహనాలపై ప్రయాణించినట్టు తెలిపారు. జనవరిలో మండల శివారు గ్రామాలు దుబ్బగూడెం, చింతగూడెం, గాట్రావ్ పల్లి, అరెట్పల్లి, పెద్దనపల్లి ప్రజలను, వ్యవసాయ కూలీలను భయ బ్రాంతులకు గురిచేసిన సంఘటనలు మరిచిపోక ముందే మంగళవారం మరలా పులి సంచారంతో హడలెత్తిపోతున్నారు.
దాదాపు పది రోజుల పాటు తాండూర్, కాసిపేట, బెల్లంపల్లి మండలాల సరిహద్దుల్లో ఉన్న అటవీ ప్రాంతంలో తచ్చాడుతూ మకాం వేసిన పులి, తీర్యాణి మీదుగా సిర్పూర్ కాగజ్ నగర్ అటవీ ప్రాంతం వైపు వెళ్ళిపోవడంతో అటవీశాఖ సిబ్బంది, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మందమర్రి మేడారం అటవీ ప్రాంతం నుండి పక్కనే కాసిపేట ముత్యంపల్లి అటవీ రేంజ్ పరిధిలో సంచరించిన పులి మళ్లీ అదే ఏరియా వైపు కనబడడంపై స్థానికంగా చర్చించుకుంటున్నారు.