WPL Season 4 | నేటి నుంచే డబ్ల్యూపీఎల్ 4వ సీజన్

WPL Season 4 | నేటి నుంచే డబ్ల్యూపీఎల్ 4వ సీజన్
- మెగా సమరానికి అంతా రెడీ
- మూడో టైటిల్పై కన్నేసిన ముంబై
- ఈ రోజు ముంబయి వర్సెస్ బెంగళూరు
- రాత్రి 7.30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో లైవ్
WPL Season 4 | వెబ్డెస్క్ (స్పోర్ట్స్), ఆంధ్రప్రభ : భారత మహిళా క్రికెట్ గతిని మార్చిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్కు వేళైంది. 2023లో డబ్ల్యూపీఎల్ తొలి ఎడిషన్ జరిగింది. అది సక్సెస్ అవ్వడంతో ఆ తర్వాత ప్రతి ఎడిషన్కు ప్రేక్షకుల నుంచి స్పందన లభిస్తోంది. దీంతో స్టేడియాల్లోనూ భారీ సంఖ్యలో ఆడియెన్స్ కనిపిస్తున్నారు.
అటు ఓటీటీ లైవ్ స్ట్రీమింగ్, టెలివిజన్ ప్రసారాల్లోనూ లైవ్ చూస్తున్న వాళ్ల సంఖ్య కోట్లలో ఉంటుంది. శుక్రవారం (జనవరి 08) నుంచి ఈ టోర్నీ 4వ సీజన్ షురూ కానుంది. శుక్రవారం తొలి మ్యాచ్ ప్రారంభానకి ముందు ఓపెనింగ్ సెర్మనీ ఉండనుంది. సాయంత్రం 6.45 గంటలకు ప్రీ మ్యాచ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని డబ్ల్యూపీఎల్ నిర్వహాకులు తెలిపారు. ఈ ఈవెంట్లో ఇండియన్ మోడల్, నటి హర్నాజ్ కౌర్ సంధు పాల్గొననున్నారు.
WPL Season 4 | 5 జట్లు మొత్తం 22 మ్యాచ్లు…

2026 మహిళల ప్రీమియర్ లీగ్కు అంతా సిద్ధమైంది. ఈ టోర్నమెంట్కు జనవరి 09న తెర లేవనుంది. ఫిబ్రవరి 05న వడోదర వేదికగా జరిగే ఫైనల్తో ఈ డబ్ల్యూపీఎల్ ముగుస్తుంది. 28 రోజులపాటు ఫ్రాంచైజీ క్రికెట్ మజా అందించేందుకు మహిళా క్రికెటర్లు రెడీ అయిపోయారు. 5 జట్లు మొత్తం 22 మ్యాచ్లు ఆడుతున్నాయి. ఇటీవల జరిగిన వేలంలో అన్ని జట్లు కూడా పలువురు కొత్త ప్లేయర్లను కొనుగోలు చేసి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి.
WPL Season 4 | తొలి మ్యాచ్ ఎవరి మధ్య అంటే..?

డబ్ల్యూపీఎల్లో అత్యంత సక్సెస్ఫుల్ జట్లు ముంబయి ఇండియన్స్ – రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్యే తొలి మ్యాచ్ జరగనుంది. ముంబయి ఈ ఎడిషన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలో దిగుతోంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సారథ్యంలోని ముంబయి నాట్సీవర్, అమెలియా కేర్, హీలీ మ్యాథ్యూలతో బలంగా ఉంది. అటు ఆర్సీబీ సైతం పటిష్ఠంగా ఉంది. స్మతి మంధాన, రిచా ఘోష్, నదైన్ డి క్లర్క్, జార్జియా వాల్ కీలక ప్లేయర్లుగా ఉన్నారు.
WPL Season 4 | ఆ రెండు స్టేడియాల్లో మ్యాచులు

ఈసారి డబ్ల్యూపీఎల్ మ్యాచ్లు నవీ ముంబయి, వడోదర రెండు స్టేడియాల్లో నిర్వహిస్తున్నారు. తొలి దశలో 9 నుంచి 17 దాకా నవీ ముంబయిలో మ్యాచ్లు ఉండనున్నాయి. తర్వాత జనవరి 19 నుంచి ఫిబ్రవరి 05 దాకా వడోదర మైదానం వేదికగా టోర్నీ సాగుతుంది. మ్యాచ్లు రోజూ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. వీకెండ్ (ఆదివారం) డబుల్ హెడర్ మ్యాచ్లు ఉన్నాయి. మధ్యాహ్నం మ్యాచ్లు 3.30 గంటలకు ప్రారంభం అవుతాయి. అర్ధగంట ముందు టాస్ ఉంటుంది.
WPL Season 4 | లైవ్ ప్రసారం ఎక్కడంటే?

ఇక ఈ టోర్నీకి ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, ఓటీటీ ప్లాట్ఫామ్ జియోస్టార్ అధికారిక బ్రాడ్కాస్టర్లుగా వ్యవహరిస్తున్నాయి. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్కు సంబంధించిన టెలివిజన్ ఛానెల్లో లైవ్ మ్యాచ్ ప్రసారం అవుతుంది. అలాగే జియోస్టార్లో లైవ్ స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే జియోస్టార్లో ఉచితంగా మ్యాచ్ చూడడం కుదరదు. దీనికి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, జియో తమ యూజర్లకు ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్స్పై జియోస్టార్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇస్తుంది.
WPL Season 4 | సక్సెస్ ఫుల్ జట్టుగా ముంబై ఇండియన్స్

డబ్ల్యూపీఎల్ టోర్నీలో ముండై ఇండియన్స్ అత్యంత విజయవంతమైన జట్టుగా ఉంది. గడిచిన మూడు సీజన్లలో రెండుసార్లు ముంబయి ఛాంపియన్గా నిలిచింది. 2023, 2025 ఎడిషన్లలో హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో ముంబయి టైటిల్ దక్కించుకుంది. ఇక 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది. అయితే ఈ మూడు సీజన్లలోనూ దిల్లీ క్యాపిటల్స్ ఫైనల్కు వచ్చింది. కానీ మూడుసార్లు కూడా తుదిమెట్టుపై బోల్తా పడింది. ఈ క్రమంలో ఈసారి ఎవరు టైటిల్ సాధిస్తారో అని ఆసక్తిగా మారింది. మళ్లీ ముంబయి, అర్సీబీల్లో ఒకరు గెలుస్తారా? లేదా కొత్త ఛాంపియన్ను చూస్తామా? అని అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది.

