శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ ప్రమాదం విషాదకరంగా ముగిసింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది సజీవ సమాధి అయ్యారు. ఈరోజు (శుక్రవారం) SLBC టన్నెల్లో గల్లంతైన 8 మంది కార్మికుల మృతదేహాలను గుర్తించారు.
ఏడో రోజు సహాయక చర్యల్లో భాగంగా ఎస్ఎల్బీసీ సొరంగంలో గల్లంతైన కార్మికుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దక్షిణ మధ్య రైల్వే నిపుణులు ప్లాస్మా గ్యాస్ కట్టర్ల సహాయంతో టీబీఎం మిషన్ను కట్ చేశారు.
బురద, శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో.. కూలీల మృతదేహాలు వెలుగుచూశాయి. ప్రమాదం జరిగిన రోజే వారంతా సొరంగంలో 3 మీటర్ల లోతు బురద నీటిలో చిక్కుకున్నారని రెస్క్యూ టీమ్ గుర్తించింది.
ఈనెల 22న ఉదయం ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్ 13.85 కి.మీ.ల వద్ద పనులు చేస్తుండగా పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో టన్నెల్లో పని చేస్తున్న 50 మందిలో 42 మంది ప్రాణాలతో బయట పడ్డారు. టన్నెల్ బోరింగ్ మిషన్లో పని చేస్తున్న ఇంజనీర్లు, కార్మికులు ఎనిమిది అక్కడే చిక్కుకుపోయారు.
మృతిచెందిన వారిలో జేపీ అసోసియేట్స్ కు చెందిన మనోజ్ కుమార్ (పీఈ), శ్రీనివాస్ (ఎస్ఈ), రాబిన్ సన్ సంస్థకు చెందిన టీబీఎం ఆపరేటర్లు సన్నీ సింగ్, గురుదీప్ సింగ్, కార్మికులు సందీప్ సాహు, జక్తాజెస్, సంతోష్ సాహు, అనూజ్ సాహు ఉన్నారు. వీరంతా జమ్మూ కశ్మీర్, పంజాబ్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు.