అంతరిక్ష యాన కొత్త చరిత్రకు అడుగుదూరంలో భారత్
భారత్ అస్ట్రోనాట్ శుభాంశు శుక్లా తొలి ప్రయాణం
స్పేస్ స్టేషన్ లో ప్రయోగాలు చేయనున్న రెండో భారతీయుడు
1984లో రాకేశ్ శర్మకు తొలి అవకాశం
తిరిగి 41 ఏళ్ల తర్వాత మరో భారత అస్ట్రోనాట్ నింగిలోకి
ఈ నెల 10 వ తేది సాయత్రం 5.52 కి ఏఎక్స్-4రాకెట్ ప్రయోగం
అమెరికాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి అంతరిక్షంలోకి
ఇప్పటికే రాకేట్ లోకి నలుగురు అస్ర్టోనాట్స్
ప్రయోగానికి కొనసాగుతున్న కౌంట్ డౌన్
భారత ప్రజల ఆశలను , కలలను అంతరిక్షంలోకి తీసుకెళుతున్న శుక్లా
బెంగళూరు – భారత అంతరిక్ష ప్రయాణం మరో మైలురాయిని దాటనుంది. గత పాతికేళ్లలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు 270 మందికి పైగా వ్యోమగాములు వెళ్లారు. కానీ వారిలో భారతీయులు ఒక్కరు కూడా లేరు. ఆ ఘనత శుభాంశు శుక్లా సాధించబోతున్నారు. ఆనాటి సోవియెట్ యూనియన్ సహకారంతో 1984లో సోయూజ్ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేశ్ శర్మ. ఆ తర్వాత కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లినా, వారు భారతీయ సంతతివారే తప్ప, భారత్లో పుట్టి పెరిగిన వ్యక్తులెవరూ అంతరిక్షంలోకి వెళ్లలేదు. కానీ, ఇప్పుడు నాలుగు దశాబ్దాల తర్వాత ఈ ఘనత సాధించనున్న రెండో వ్యక్తిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళుతున్న తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా నిలవనున్నారు. ఆక్సియం 4 మిషన్లో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా 2025 జూన్10న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5గంటల 52 నిమిషాలకు ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లబోతున్నారు.
కాగా, చరిత్రాత్మకమైన అంతరిక్షయాత్ర ‘ఆక్సియం మిషన్ 4’ (ఏఎక్స్-4)కు పైలట్గా భారత వైమానికదళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా వ్యవహరించబోతున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో రెండు వారాలు ఉండేందుకు వెళ్లనున్న నలుగురు సభ్యుల బృందంలో శుక్లా ఒకరు. అంతరిక్షంలోకి వెళుతున్న రెండో భారతీయుడిగా, ఐఎస్ఎస్లో అడుగుపెడుతున్న తొలి భారతీయుడిగా ఘనత సాధించనున్నారు. దీంతో ఈ యాత్రపై భారతదేశమంతటా ఆసక్తి నెలకొంది.
భారతీయ కాలమానం ప్రకారం ఈనెల 10వ తేదీ సాయంత్రం 5:52 గంటలకు నాసాకు చెందిన ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఏఎక్స్-4 ఐఎస్ఎస్ దిశగా నింగిలోకి వెళ్లనుంది.
ఏఎక్స్-4లో ప్రయాణించనున్న బృందానికి నాసా మాజీ ఆస్ట్రోనాట్ పెగ్గీ విట్సన్ నాయకత్వం వహిస్తున్నారు. వందలాది రోజులు అంతరిక్షంలో గడిపిన అనుభవం ఉన్న ఆయన… పది సార్లు స్పేస్ వాక్ చేశారు ఈ బృందంలో మిగతా ఇద్దరు వ్యోమగాములు పోలండ్కు చెందిన స్లావోజ్ ఆజ్నాన్స్కీ-విజ్నియాస్కీ, హంగేరీకి చెందిన టైబర్ కాపు. శుక్లా మాదిరిగానే వారు కూడా తమ దేశాల తరఫున నాలుగు దశాబ్దాల తర్వాత అంతరిక్షంలో అడుగు పెడుతున్నారు. ఈ యాత్రలో పైలట్గా శుక్లా పాత్ర చాలా కీలకమని నిపుణులు చెబుతున్న మాట. లాంచ్, డాకింగ్, అన్డాకింగ్ సమయంలో వ్యోమనౌకను నిర్వహించడం, తిరిగి భూమి మీదకు తీసుకురావడంలో మిషన్ కమాండర్కు శుక్లా సెకండ్-ఇన్-కమాండ్గా వ్యవహరిస్తారు.
ఈ నలుగురు వ్యోమగాముల బృందం మొత్తం 60 ప్రయోగాలు చేయనున్నారు. వాటిలో ఏడు భారతదేశం ప్రతిపాదించినవి ఉననాయి. అంతరిక్షం గురించి మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి, జీవశాస్త్రం, సూక్ష్మ గురుత్వాకర్షణశక్తిపై దాని ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ఇస్రో ప్రయోగాలు ఉపయోగపడతాయని నాసా మాజీ శాస్త్రవేత్త మిలా మిత్ర చెప్పారు. ఆరు రకాల పంటల విత్తనాలపై స్పేస్ ఫ్లయిట్ ప్రభావం ఏమిటనేదీ అధ్యయనం చేయడం కీలక ప్రయోగాలలో ఒకటన్నారు. భవిష్యత్తు పరిశోధనా లక్ష్యమైన అంతరిక్షంలో పంటలు ఏవిధంగా పెరుగుతాయో అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడటమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని వివరించారు. ఆహారం, ఇంధనంగానే కాకుండా లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్గానూ ఉపయోగించడానికి మూడు రకాల సూక్ష్మ శైవలాల జాతులు అభివృద్ధికి సంబంధించి మరో ప్రయోగం చేయనున్నారు. సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తిలోనూ పెరగగలిగే ఒక దాన్ని గుర్తించడానికి అది ఉపయోగపడుతుందని మిత్ర చెప్పారు.
ప్రయాణానికి సిద్ధంగా…
అంతరిక్ష ప్రయాణ సన్నాహాల్లో భాగంగా నలుగురు వ్యోమగాములు మే 25వ తేదీ నుంచి ప్రత్యేక పర్యవేక్షణ (క్వారంటైన్)లో ఉన్నారు. గత రాత్రి మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తెల్లని చిన్న హంస బొమ్మ ను అక్కడ చూపించారు. ఏఎక్స్-4లో ప్రయాణించే తమ బృందంలో అది ఐదవ సభ్యురాలు కాబోతోందని వారు చమత్కరించారు. మేం అన్నిరకాల శిక్షణను పూర్తి చేశాం. లాంచ్కు సిద్ధమయ్యాం. మా బృందం చక్కగా కలిసింది అని కమాండర్ విట్సన్ చెప్పారు.
భారతీయుల ఆశలు, కలలను ..
భారతీయుల ఆశలు, కలలను మోసుకెళ్తున్నానని, తన ఉత్సాహాన్ని మాటల్లో చెప్పలేనని గ్రూప్ కెప్టెన్ శుక్లా అన్నారు. ఇప్పటివరకూ ఇదొక అద్భుతమైన ప్రయాణం. అంత ఉన్నతమైనది ఇప్పటివరకూ లేదు అని ఆయన చెప్పారు. నేను అంతరిక్షంలోకి వెళుతున్నాను. నేను తీసుకెళుతున్నవి కేవలం యంత్రాలు, పరికరాలు మాత్రమే కాదు. వంద కోట్ల మంది హృదయాల ఆశలు, కలలు అని శుక్లా వ్యాఖ్యానించారు. ఈ మిషన్ విజయవంతమవ్వాలని భారతీయులంతా ప్రార్థన చేయాలని కోరుతున్నాను అని అన్నారు.
గగన్యాన్ దిశగా….
నిర్ణీత షెడ్యూల్ ప్రకారం 2027లో ప్రయోగించనున్న దేశ తొలి మానవ సహిత స్పేస్ ఫ్లయిట్లో వెళ్లేందుకు గత ఏడాది ఎంపిక చేసిన నలుగురు భారత వైమానిక దళ అధికారులలో 39 ఏళ్ల శుభాంశు శుక్లా ఒకరు. ముగ్గురు వ్యోమగాములను 400 కిలోమీటర్ల కక్ష్యలోకి పంపించి, మూడు రోజుల తర్వాత వెనక్కి తీసుకురావాలన్నది గగన్యాన్ మిషన్ లక్ష్యం. 2035 నాటికల్లా ఒక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేయడం, 2040లో చంద్రుడిపైకి ఒక వ్యోమగామిని పంపడం అనే ప్రతిష్టాత్మక లక్ష్యాలను భారతదేశం ఇప్పటికే వెల్లడించింది. గగన్యాన్కు సన్నద్ధతలో భాగంగా భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చాలా పరీక్షలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే మహిళ రూపంలోని రోబోను అంతరిక్షంలోకి పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వారాంతంలోని ఏఎక్స్-4 మిషన్ ఇస్రోకు అత్యంత ఉత్తేజకరమైన అవకాశమని, ఇది భారతదేశమంతటా ఎంతో ఉత్సుకతను కలిగిస్తోందని అధికారులు చెప్పారు
ఆక్సియం స్పేస్ ఆధ్వర్యంలో…
స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఈ బృందం ఆదివారం అంతరిక్షంలోకి వెళ్లబోతోంది. ఏఎక్స్-4 ఒక వాణిజ్య తరహా స్పేస్ ఫ్లయిట్. దీన్ని హ్యూస్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ఆక్సియం స్పేస్ అనే ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తోంది. దీనికి నాసా, ఇస్రో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈసా) సహకారం అందిస్తున్నాయి. ఏఎక్స్-4లో శుక్లాను ఐఎస్ఎస్కు పంపడానికి, అందుకు అవసరమైన శిక్షణ ఇవ్వడానికి ఇస్రో దాదాపు రూ.507 కోట్లు (59 మిలియన్ డాలర్లు) చెల్లించింది. ఈ యాత్ర ద్వారా ఆయన అనుభవం భారత అంతరిక్ష పరిశోధనలకు అపారంగా ఉపయోగపడుతుందని భావిస్తోంది. ఈ మిషన్ నుంచి మనం పొందే ప్రయోజనం శిక్షణ, సౌకర్యాలపై అవగాహన, అంతరిక్షంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రయోగాల నిర్వహణలో అనుభవపరంగా అసాధారణమైంది అని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఇటీవల చెప్పారు. గ్రూప్ కెప్టెన్ శుక్లా గత ఏడాది ఆగస్టు నుంచి శిక్షణ పొందుతున్నారని ఇస్రో ప్రాజెక్టు డైరెక్టర్ సుదీశ్ బాలన్ అన్నారు.