తాండూరులో కదిలిన మొదటి బస్సు..!

తాండూరులో కదిలిన మొదటి బస్సు..!
- దగ్గరుండి తరలించిన పోలీసులు
తాండూరు, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీసీ డిపోలో మొదటి బస్సు రోడ్డు ఎక్కింది. పోలీసుల రక్షణ మధ్య ఆర్టీసీ అధికారులు బస్సును కదిలించారు. డిమాండ్లు నెరవేర్చాలని బుధవారం నుంచి ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సమ్మెకు దిగడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాండూరు ఆర్టీసీ డిపోలో బస్సు రవాణా సర్వీసును ప్రారంభించారు.
పోలీసుల బందోబస్తు మధ్య తాండూరు డిపో నుంచి మహబూబ్ నగర్ మార్గంలో బస్సును కదలించారు. తాండూరు డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు అధికారుల రక్షణలో బస్సును తరలించే చర్యలు చేపట్టారు. ఆర్టీసీ బస్సు ముందు వెళ్లగా బస్సుతో పాటు రక్షణగా పోలీసులు తరలి వెళ్లారు. దీంతో తాండూరు ఆర్టీసీ డిపోలో బస్సు రోడ్డు ఎక్కింది.

