Diarrhea | డయేరియా కేసులు కలకలం…

Diarrhea | డయేరియా కేసులు కలకలం…
- అధికారులు అప్రమత్తంగా ఉండాలి.
- జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
Diarrhea | మోతె, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో డయేరియా కేసులు పూర్తిగా నివారించే వరకు ఆరోగ్య శిబిరం నిర్వహించాలని, ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.జడ్పీ సి.ఈ.ఓ శిరీష, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వెంకటరమణ, తహసీల్దార్ వెంకన్న, ఎంపిడిఓ ఆంజనేయులు, మెడికల్ ఆఫీసర్ భవాని, ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులు, పంచాయతీ కార్యదర్శి భూలక్ష్మి లతో కలెక్టర్ ఛాంబర్ నుండి మంగళవారం టెలికాన్ఫిరెన్స్ నిర్వహించారు.
వైద్య ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ రాజ్ అధికారులు క్షేత్ర స్థాయి లో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మోతె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది 24×7 విధుల్లో ఉండాలని ఆదేశించారు. వ్యాధుల వ్యాప్తిని అడ్డుకునేందుకు స్వచ్ఛమైన త్రాగు నీటి వినియోగం, పారిశుద్ధ్య నిర్వహణ, వ్యక్తిగత పరిశుభ్రత అలాగే ముందస్తు నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

గత గురువారం రోజున సిరికొండ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి విరేచనాలతో బాధపడుతుండగా ఆశ కార్యకర్త మెరుగైన చికిత్స కొరకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మోతె కు పంపించి చికిత్స అందించటం జరిగినదని, గత 3 రోజులలో 50 మందికి చికిత్సను అందించటం జరిగినదని, వీరంతా మిరప తోటలో పనికి వెళ్ళి అక్కడ కలుషితమైన నీటిని త్రాగుట వలన అస్వస్థతకు గురవటం గుర్తించామని, నీటి నమూనాలను పరీక్షల కొరకు పంపించటం జరిగినదని మండల అధికారులు కలెక్టర్ కి వివరించారు.అధికారులు, గ్రామస్తులు సమన్వయం చేసుకుంటూ అస్వస్థకు గురైన ప్రజలు త్వరగా కోలుకునేలా చూడాలని కలెక్టర్ అధికారులకు తెలియజేశారు.
