YS Jagan | చంద్రబాబువి అన్నీ మోసాలే..

YS Jagan | చంద్రబాబువి అన్నీ మోసాలే..
- రైతుల సమస్యలు తీర్చడంలో విఫలం
- భూముల రీసర్వే చేయాలన్న ఆలోచన లేదు
- వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
YS Jagan | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు క్రెడిట్ చోరీ, పల్నాడు గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో జరిగిన దారుణ ఘటన.. తదితర అంశాలపై పలు కీలక విషయాలను ఆయన వివరిస్తున్నారు.
భూమండలం మీద క్రెడిట్ చోరీ చేయగలిగిన ఒకే ఒక్క వ్యక్తి చంద్రబాబు అని, ఊసరవెల్లి కూడా చంద్రబాబుని చూసి సిగ్గుపడుతుందని, అంతటి దారుణమైన మోసాలు చేస్తున్నారాయన అని విమర్శించారు. రైతుల సమస్యలు తీర్చాలన్న కనీస ఆలోచన కూడా ఆయనకు లేదని, భూముల రీసర్వే చేయాలన్న ఆలోచన కూడా బాబుకు ఏనాడూ రాలేదని, రీసర్వే ఆలోచన నాకు నా పాదయాత్రలోనే వచ్చిందన్నారు.
మేం అధికారంలోకి రాకముందు సర్వేయర్లు లేరని, భూములు సర్వే చేసే టెక్నాలజీ కూడా లేదన్నారు. సవాలక్ష భూ సమస్యలకు పరిష్కారం చేయడమే రీసర్వే అని అన్నారు. 22ఏలో భూములు పెట్టడం మాత్రమే చంద్రబాబుకు తెలుసు అని, వందేళ్ల కిందట బ్రిటీషర్లు భూ సర్వేలు చేశారని, మేం అధికారంలోకి వస్తే సమగ్ర భూసర్వే చేయిస్తామని 2019 మేనిఫెస్టోలో పెట్టామన్నారు.
చెప్పినట్లుగానే.. 2020 డిసెంబర్ 21న భూ రీసర్వే మొదలుపెట్టాం అన్నారు. సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ గొప్ప అధ్యాయం ప్రారంభించామని, భూ సర్వేను మహాయజ్ఞంలా చేపట్టామన్నారు. వివాదాలు లేని విధంగా పాదర్శకంగా భూములు రీసర్వే చేశామన్నారు. రికార్డులు ట్యాంపర్ చేయలేని విధంగా సంస్కరించామని తెలిపారు. భూ యజమానులకు శాశ్వత యాజమాన్య పత్రాలు ఇచ్చామన్నారు.
ప్రభుత్వం పూచీకత్తుగా పత్రాలు రైతులకు అందించామని, అడ్వాన్స్డ్ ఫీచర్లతో రైతులకు పాస్బుక్ ఇచ్చామన్నారు. ఆ పాస్బుక్కుల్లో క్యూఆర్ కోడ్ పెట్టామన్నారు. నాలుగుసార్లు సీఎంగా ఉండి.. 80 పదుల వయసు దగ్గర పడుతున్న చంద్రబాబుకి ఏనాడైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా? అని.. జగన్ ప్రశ్నించారు.
