శరీరం, మనసు, ఆత్మ సమతుల్యతకు యోగమే మార్గం

శరీరం, మనసు, ఆత్మ సమతుల్యతకు యోగమే మార్గం
- కలెక్టర్ డాక్టర్ సత్య శారద
ఖిలావరంగల్, ఆంధ్రప్రభ : శరీరం, మనసు, ఆత్మ సమతుల్యతకు యోగమే మార్గమని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా 5వ రోజు ఆరోగ్య థీమ్ సందర్భంగా శుక్రవారం ప్రపంచ హోమియోపతి దినోత్సవం, ఆయుష్ దినోత్సవం వేడుకలు ఖిలావరంగల్ లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం స్వయంభూ దేవాలయం వద్ద నిర్వహించిన యోగ ప్రదర్శనలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద స్వయంగా పాల్గొని యోగ ఆసనాలు వేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగ సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు జీవనశైలి సంబంధిత వ్యాధులను నివారించుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో యోగా ను భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ శామ్యూల్ హనుమాన్ (ఫాదర్ ఆఫ్ ఆయుష్) జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం ఖిలావరంగల్ పడమర కోటలోని ముదిరాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన ఆయుష్ హెల్త్ క్యాంప్ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ శిబిరంలో ఆయుష్ వైద్యులు ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉమా దామోదర్ యాదవ్, భోగి సువర్ణ సురేష్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పి సీఈఓ రామ్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు, జిల్లా ఇన్చార్జ్ మైదం రాజు, డీపీ ఎం రాజు, నేచురోపతి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమృత వల్లి, ఆయుష్ వైద్యులు డాక్టర్ రాజేందర్, డాక్టర్ రాము, డాక్టర్ శ్రీలత, అధికారులు, ప్రజాప్రతినిధులు, నర్సులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
