AP | మిస్సింగ్ విద్యార్థినుల ఆచూకీ లభ్యం
- పిడుగురాళ్లలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- వెంటనే విజయవాడకు తరలింపు
- తల్లిదండ్రులకు అప్పగింత
- వేగంగా స్పందించిన పోలీసులకు పేరేంట్స్ కృతజ్ఞతలు
విజయవాడ – ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్లో నలుగురు ఇంటర్మీడియట్ విద్యార్థినీలు అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ముస్తాబాద్కు చెందిన నలుగురు విద్యార్థినీలు విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నారు. అయితే వీరంతా కాలేజీ హాస్టల్ నుంచి ఎవ్వరికీ చెప్పకుండా బుధవారం ఒక్కసారిగా వెళ్లిపోయారు. తమ స్నేహితులు ఎంతసేపటికీ కనిపించకపోవడంతో కళాశాల సిబ్బందికి తోటి విద్యార్థినిలు సమాచారం అందించారు. కళాశాల మెుత్తం వెతికినా వారి ఆచూకీ మాత్రం కనిపించలేదు. దీంతో కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఖాకీలు దర్యాప్తు చేపట్టారు. అయితే విద్యార్థినీలు హైదరాబాద్ వైపు వెళ్తున్నారని సమాచారం అందడంతో వారి కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. వివిధ పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు.
ఇక ఆ విద్యార్థినీలు నలుగురూ హైదరాబాద్ వెళుతున్నట్లు గుర్తించి పిడుగురాళ్ల పోలీసులను అప్రమత్తం చేశారు. పిడుగురాళ్ల పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టి బాలికలను గత రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాలికలకు కౌన్సెలింగ్ చేసి నేటి ఉదయం వారి తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. అయితే ఈ నలుగురు ఎందుకు హైదరాబాద్ వెళుతున్నారనే విషయంపై వివరాలు సేకరిస్తున్నారు.. విద్యార్దినులు దొరకడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్లుకున్నారు. వేగంగా స్పందించి తమ బిడ్డలను క్షేమంగా అప్పగించిన పోలీసులు పేరేంట్స్ కు కృతజ్ఞతలు తెలిపారు.