గత ఏడాది డిసెంబర్ లో పరీక్షలు నిర్వహణ
783 పోస్టులకు 2.50 లక్షల మంది పోటీ
హైదరాబాద్ : ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్టును టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచింది. 783 పోస్టుల భర్తీకి 2022లో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలకాగా, 5 లక్షలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలకు 46 శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. అంటే సగానికి సగం మంది మాత్రమే గ్రూప్-2 పరీక్షలను రాశారు. 2024 డిసెంబర్ 16,17న పరీక్షలు నిర్వహించారు. కాగా, 1363 గ్రూప్-3 పోస్టులకు సంబంధించి ఫలితాలను ఈ నెల 14న విడుదల చేయనుంది. మార్చి 17న హాస్టల్ వెల్ఫేర్, 19న ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఫలితాలను రిలీజ్ చేస్తామని టీజీపీఎస్సీ తెలిపింది.
గ్రూప్ 1 మెయిన్స్ రీ కౌంటింగ్ కు 15 రోజులు గడువు
.అటు గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలు నిన్న వెలువడ్డాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 పోస్టుల భర్తీకి గత ఏడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ఫలితాలను టీజీపీఎస్సీ సోమవారం ప్రకటించింది. ఫలితాలను అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో తమ వ్యక్తిగత లాగిన్లో చూసుకోవచ్చు. ఈనెల 16 సాయంత్రం 5గంటల వరకు అభ్యర్థులు మార్కులను చూసుకోవచ్చని, డౌన్లోడ్ చేసుకోవచ్చని కమిషన్ తెలిపింది. రీకౌంటింగ్కు 15 రోజుల గడువు ఉంటుంది. దీనికోసం ప్రతి పేపర్కు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.