హైదరాబాద్ : పాకిస్థాన్కు గుణపాఠం చెప్పే విషయంలో కేంద్రానికి సహకరించామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. యుద్ధం అంటే ధైర్యం, వెన్నెముక, యుద్ధతంత్రం ఉండాలని తెలిపారు. నాలుగు రోజుల యుద్ధం తర్వాత అర్ధాంతరంగా యుద్ధం ఎందుకు ఆపేశారని రేవంత్రెడ్డి ప్రశ్నించారుభారత్పై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారని ధ్వజమెత్తారు. ఉగ్రవాదులను తుదముట్టించే వరకూ సైన్యానికి అండగా ఉంటామని తెలిపారు.
ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గంలో ఇవాళ(గురువారం) జై హింద్ యాత్ర నిర్వహించారు. బాచుపల్లి వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి కె జి ఆర్ కన్వెన్షన్ వరకూ జైహింద్ యాత్ర కొనసాగింది
నిజాంపేట కొలన్ గోపాల్రెడ్డి కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించారు. యుద్ధం చేయాలనుకున్నప్పుడు అఖిలపక్షాన్ని పిలిచారని.. యుద్ధం ఆపేసినప్పుడు అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధాన్ని గెలిపిస్తారని తెలిపారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గి యుద్ధాన్ని అర్ధాంతరంగా ఆపేశారా? అని నిలదీశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా ముందుకు వచ్చి యుద్ధం ఆపానని ప్రకటించారని గుర్తు చేశారు. పాకిస్థాన్కు గుణపాఠం చెప్పడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. పీవోకేను స్వాధీనం చేసుకోవాలని మోదీతో తాము చెప్పామని అన్నారు. 1971 యుద్ధంలో పాకిస్థాన్ను ఓడించామని సీఎం చెప్పుకొచ్చారు.
మోదీకి వీరతిలకం దిద్ది పాకిస్థాన్పై యుద్ధం చేయాలని చెబితే.. ఎందుకు వెనుకడుగు వేశారో బీజేపీ నేతలే చెప్పాలి. ట్రంప్ బెదిరించగానే మోదీ ఎందుకు తలొగ్గారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం.. మీ సొంత వ్యవహారం కాదు. భారతీయుల ఆత్మగౌరవాన్ని ట్రంప్ దగ్గర తాకట్టు పెడతారా?. యుద్ధం అంటే ఉపన్యాసాలు చెప్పడం కాదు. దేశ ప్రజలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి. మేం నిర్వహించిన ర్యాలీ ఎన్నికలు, ఓట్ల కోసం కాదు.. సైనికుల ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం నిలబెట్టడానికి. కాలం చెల్లిన రూపాయి ప్రధాని మోదీ. దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరం. బలూచిస్థాన్ను విడగొట్టి మరో దేశంగా చేయమన్నాం. ఇది చేతకాదు కానీ.. కాంగ్రెస్ను విమర్శిస్తున్నారు. యుద్ధంలో ఎన్ని రఫెల్ విమానాలు నేలకూలాయో లెక్క చెప్పండి. పాక్ను ఓడించాలంటే ఇందిరాగాంధీ మార్గంలో నడవాలని ప్రధాని మోదీకి సూచించాం’ అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.