మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రశాంత వాతావరణంలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కొల్చారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో నిర్వహించిన పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా 10,402 హాజరు కావాల్సి ఉండగా, 10,373 మంది హాజరయ్యారు. వివిధ కారణాల చేత 29మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ… విద్యార్థులు తొలి రోజంతటి ఉత్సాహంతో మిగిలిన అన్ని పరీక్షలను కూడా సమర్థవంతంగా రాయాలని ఆకాంక్షించారు. అలాగే పరీక్షల నిర్వహణ నిబంధనలను పకడ్బందీగా పాటించాలని అధికారులను ఆదేశించారు. మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు. మిగిలిన పరీక్షలు విద్యార్థులు ఏ విధమైన ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో రాసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో భద్రత, పర్యవేక్షణ, విద్యార్థులకు తాగునీరు, లైటింగ్, ఫర్నిచర్, టాయిలెట్ సదుపాయాల ఏర్పాట్లు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.