Smart City | స్మార్ట్ నిధులు ఏమయ్యాయి…?
- మంత్రికి కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ సమస్యలపై లేదు..
- కనీసం పట్టించుకోని మంత్రి సురేఖ
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్
- శివనగర్ వాటర్ ట్యాంక్ అండర్ డ్రైనేజీ పనుల వద్ద బీజేపీ నిరసన
Smart City | కరీమాబాద్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏమయ్యాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్(Ganta Ravikumar) ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ శివనగర్ మండల పరిధిలోని అండర్ డ్రైనేజీ త్వరగా పూర్తి చేయాలని శివనగర్ ను ముంపు ప్రాంతం నుండి కాపాడాలని శివనగర్ వాటర్ ట్యాంక్ వద్ద ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ హాజరై మాట్లాడుతూ… బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన అండర్ డ్రైనేజీ పనులు గత ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగిందన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే నిర్లక్ష్యం అవలంబిస్తోందని మండిపడ్డారు. స్థానిక మంత్రి కొండా సురేఖ కనీసం ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని ఆరోపించారు. మంత్రికి కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ సమస్యల్ని పరిష్కరించడంలో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజీ పనుల జాప్యంతో నర్సంపేట నుంచి ఖమ్మం వెళ్లే రహదారిలో వాహనదారులు(Motorists) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.
చిన్నపాటి వర్షం పడిందంటే చాలు శివనగర్ నీటమునిగి కాలనీవాసులు అనేక పాట్లు పడుతున్నారని వెల్లడించారు. సరైన దారిలేక తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, వాహనదారులు ఆస్పత్రి పాలవుతున్నారని వాపోయారు.
అయినా మంత్రి సురేఖ ఒక్కసారైనా పనులను పరిశీలించిన దాఖలాలు లేవని ఆరోపించారు. సురేఖను ఓట్లేసి గెలిపిస్తే ఆమె గాడిని దాటి రావడం లేదని విమర్శించారు. వరంగల్లో ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించిన దాఖలాలు లేవని, కనీసం వరంగల్ బస్టాండ్ను కూడా నిర్మించలేని దుస్థితిలో మంత్రి సురేఖ ఉండడం ఈ ప్రాంత దురదృష్టమన్నారు.

మరోవైపు కేంద్రం భారీగా స్మార్ట్ సిటీ(Smart City) కింద నిధులు విడుదల చేసినా అభివృద్ధి పనులు చేయడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా శివనగర్ అండర్ డ్రైనేజీ పనుల్లో వేగం పెంచి త్వరలోనే పూర్తి చేయాలని లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని గంట రవికుమార్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, రత్నం సతీష్ షా, జిల్లా ఉపాధ్యక్షుడు కనుకుంట్ల రంజిత్(Kanuntla Ranjith), గడల కుమార్, మాచర్ల దీన్ దయాళ్, జిల్లా నాయకులు బైరి శ్యామ్, ఆడేపు వెంకటేష్, మార్టిన్ లూథర్, బైరి నాగరాజు, మండల నాయకులు వైట్ల గణేష్, సూర శ్రీనివాస్, తమ్మిశెట్టి క్రాంతి, తాళ్ళపెల్లి శ్రీను, నవీన్, సురేందర్, మార్తా ఉష రాణి, సుజాత, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

